రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఏ త్యాగానికయినా సిద్ధంగా ఉంది ...ఎర్రబెల్లి
By: Sankar Tue, 06 Oct 2020 8:58 PM
రైతుకు అండగా నిలిచిన ఘనత రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని, రైతాంగాన్ని ఆదుకోవడానికి మన ప్రభుత్వం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్లలో మంగళవారం 130 మంది లబ్ధిదారులకు మంత్రి డిజిటల్ పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రైతును రాజు చేయడమే ప్రధాన ధ్యేయంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తుందన్నారు. కరోనా కష్టకాలంలోనూ రైతులను ఆదుకున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు.
నూతన రెవెన్యూ చట్టం వల్ల పేదలకు సరైన న్యాయం జరుగుతుందని, సాదా భైనామాలో తీరని చిక్కులన్నీ రెవెన్యూ చట్టం వల్ల తొలగిపోతాయని మంత్రి అన్నారు. వ్యవసాయ భూముల్లాగే వ్యవసాయేతర భూములకు కూడా పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం తలపెట్టిందన్నారు.
తమ భూములకు రక్షణ, హక్కు, భద్రత కల్పిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.