ప్రణబ్ పుస్తకంలో తెలంగాణ ప్రస్తావన
By: Dimple Mon, 31 Aug 2020 11:36 PM
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణబ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశం కోసం ఆయన నిస్వార్థంగా సేవ చేశారన్నారు. తెలంగాణ అంశంతో ప్రణబ్కు ఎంతో అనుబంధం ఉందన్నారు. యుపిఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు వేసిన కమిటీకి నాయకత్వం వహించిన ప్రణబ్, చివరికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై సంతకం చేశారని కేసీఆర్ గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర డిమాండ్లో న్యాయం ఉందని భావించే వారని, తాను కలిసిన ప్రతీ సారి ఎన్నో విలువైన సూచనలు చేసే వారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ప్రణబ్ రాసిన పుస్తకాల్లో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. వ్యక్తిగతంగా తన తరుపున, తెలంగాణ ప్రజల తరుఫున ప్రణబ్ కు నివాళి అర్పించారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణబ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో సంక్షోభాలను పరిణితితో పరిష్కరించిన తీరు ఆదర్శణీయం అని కొనియాడారు. రాష్ట్రపతిగా, కేంద్రమంత్రిగా ప్రణబ్ దేశానికి ఎంతో సేవలు చేశారని ప్రశంసించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నానని, అతని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
ప్రణబ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ సేవలు అజరామరం అని కొనియాడారు. ఐదు దశాబ్ధాల పాటు దేశానికి ఎంతో సేవ అందినారని ప్రశంసించారు. బహుళపార్టీ వ్యవస్ధలో ఏకాభిప్రాయ సాధకునిగా ప్రశంశలు అందుకున్న వ్యక్తి ప్రణబ్ అని కొనియాడారు. ముఖ్యమైన చట్టాల రూపకల్పనలో ప్రణబ్ కీలక భూమికను పోషించారని గుర్తుచేశారు.