కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ముప్పు పొంచి ఉన్న తెలంగాణ
By: chandrasekar Tue, 23 June 2020 2:13 PM
భారత్ లో మహమ్మారి వైరస్
కేసులు నానాటికీ పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే. రోజుకు పదివేలకు పైగా కేసులు
నమోదవుతుండడం కలవరపెడుతోంది. గత వారం రోజుల వ్యవధిలో లక్షకు పైగా కేసులు నమోదు
కావడంతో ఆందోళన మొదలైంది. ఈ ప్రాణాంతక వైరస్ పంజా విసురుతున్న తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాలలోనూ
కేసుల సంఖ్య పెరుగుతోంది.
ముఖ్యంగా తెలంగాణలో గత 10
రోజులుగా కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం శోచనీయం. కేసుల తీవ్రతను బట్టి తెలంగాణలో
వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ దశ ప్రారంభమైందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అయితే, ఆ
అభిప్రాయాలను ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ కొట్టిపారేశారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో
కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ పై తాజా సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశవ్యాప్తంగా కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ముప్పు పొంచి ఉన్న రాష్ట్రాల జాబితాలో
తెలంగాణ రెండో స్థానంలో ఉందని తాజా సర్వేలో వెల్లడైంది. ఆ జాబితాలో దేశ రాజధాని
ఢిల్లీ తొలి స్థానంలో ఉండగా తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఇక, మరో
తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ ఆ జాబితాలో చివరి స్థానాల్లో ఒకటి
దక్కించుకుంది.
ఇండియా ఇన్ పిక్సెల్స్
అనే సంస్థ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ పై ఆసక్తికర విషయాలు వెలుగులోకి తెచ్చింది.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యకు, క్వారంటైన్
లో ఉన్న వారి సంఖ్యల నిష్పత్తి ఆధారంగా ఈ గణాంకాలను రూపొందించింది. తెలంగాణకు
కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ముప్పు పొంచి ఉందని అప్రమత్తంగా ఉండాలని ఆ సంస్థ
గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. అంతకుముందే, తెలంగాణలో రోజువారి కరోనా టెస్టుల సంఖ్య ఎంతో
వెల్లడించాలని కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్లు వినిపిస్తోన్న సంగతి
తెలిసిందే. కొద్ది రోజులుగా టెస్టుల సంఖ్య 4వేలకు పెరిగినా ఆ సంఖ్య మరింత పెరగాలని ఆరోగ్య
నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టెస్టుల సంఖ్య పెంచకుంటే
కేసుల సంఖ్యలో ఢిల్లీ, మహారాష్ట్రలను తెలంగాణ అధిగమిస్తుందని
హెచ్చరిస్తున్నారు. మరోవైపు, పొరుగు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు ఈ ముప్పు
కేవలం 8 శాతం
ఉండడం ఊరటనిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడికి తీసుకుంటోన్న చర్యలు
బాగున్నాయని, ఏపీలో అత్యధిక సంఖ్యలో కరోనా టెస్టులు చేస్తున్నారని
జాతీయ స్థాయి వైద్య, ఆరోగ్య నిపుణులు ప్రశంసలు కురిపించిన సంగతి
తెలిసిందే.