కరోనా నుంచి కోలుకున్న తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ
By: Sankar Fri, 03 July 2020 9:08 PM
తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ కరోనా నుంచి కోలుకున్నారు. కోవిడ్ పాజిటివ్గా తేలడంతో చికిత్స పొందడం కోసం ఆయన అపోలో హాస్పిటల్లో చేరారు. డిప్యూటీ సీఎంతోపాటు ఆయన కుమారుడు, మనవడు కూడా హాస్పిటల్లో చేరారు. కరోనా లక్షణాలేవీ లేకపోయినప్పటికీ ఆస్తమా ఉండటంతో ముందు జాగ్రత్తగా కుటుంబ సభ్యులు ఆయణ్ని హాస్పిటల్లో చేర్పించారు. తాజా పరీక్షల్లో అలీతోపాటు ఆయన కుటుంబ సభ్యులకు నెగటివ్ అని రిపోర్ట్ రావడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు.అందరి ప్రార్థనలతో తాను త్వరగా కోలుకున్నానంటూ కృతజ్ఞతలు తెలిపారు.
కరోనా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలోనే నమోదవుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధికారిక నివాసం ప్రగతిభవన్లో పనిచేసే 20 మందికి వైరస్ సోకింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు విస్తృతంగా శానిటైజేషన్ పనులు ముమ్మరం చేశారు.
అయితే ప్రగతి భవన్ ఉద్యోగులకు కరోనా అంశంపై ప్రభుత్వం మాత్రం ఇప్పటిదాకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక దేశంలో కరోనా ఉదృతి రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 20,903 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,25,439కి చేరింది.