ఫీల్డ్ అసిస్టెంట్ ల తొలగింపు పిటిషన్ పై విచారణ చేపట్టిన హై కోర్ట్ ..
By: Sankar Mon, 17 Aug 2020 5:15 PM
తెలంగాణలో 8 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై రాష్ట్ర హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ను తెలంగాణ రాష్ట్ర ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కోర్టు విచారణ సందర్భంగా పిటిషనర్ తరపున సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య వాదనలు వినిపించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2005 చట్టం ప్రకారం ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారని రంగయ్య హైకోర్టుకు తెలిపారు..
గత నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను తొలగించారని అన్నారు. తొలగించిన 8 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రంగయ్య కోర్టును కోరారు. పెండింగులో ఉన్న నాలుగు నెలల జీతం చెల్లించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని తెలిపారు.
దీనిపై స్పందించిన హైకోర్టు.. ఫీల్డ్ అసిస్టెంట్ పిటిషన్పై కౌంటర్ ధాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇందుకు ప్రభుత్వం రెండు వారాల సమయం కోరింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది..