సచివాలయం కూల్చివేతపై తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు ..
By: Sankar Mon, 29 June 2020 1:49 PM
ప్రస్తుతం ఉన్న తెలంగాణ సచివాలయం చాలా పాతది , గోడలు అన్ని నెర్రలు వచ్చి ఎప్పుడు కూలిపోతుందో తెలియదు అందుకే దీనిని పడగొట్టి కొత్త సచివాలయాన్ని నిర్మించాలని సీఎం కెసిఆర్ ప్రకటించగానే అన్ని వైపులా నుంచి విమర్శలు వచ్చాయి .. వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేయాలనై కెసిఆర్ చూస్తున్నాడు అని అన్నారు ..దీని మీద హైకోర్టులో కేసు కూడా ఫైల్ అయింది ..
అయితే ఈ విషయంలో ప్రభుత్వమే విజయం సాధించింది.. తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. సచివాలయం కూల్చివేతపై వేర్వేరుగా దాఖలైన 10 పిటిషన్లపై న్యాయస్థానంలో సోమవారం విచారణ జరగగా.. చివరికి ప్రభుత్వ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. నూతన సచివాలయ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని తేల్చిచెప్పింది. సచివాలయం కూల్చివేయొద్దంటూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది.
వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని పిటిషన్లు వాదనలు వినిపించగా, ప్రభుత్వ పాలసీ విధానాలపై న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించింది. ప్రస్తుతం ఉన్న సచివాలయంలో సరైన సదుపాయాలు లేవని, ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని ప్రభుత్వం వివరించింది. ప్రభుత్వ వాదనలతో ఏఖిభవించిన ధర్మాసనం.. సచివాలయ కూల్చివేతకు అనుమతి ఇచ్చింది. దీంతో నూతన సచివాలయ నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్ని తొలిగిపోయాయి.