ప్రణయ్ హత్యకేసులో కింది కోర్టు విచారణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
By: Sankar Tue, 15 Dec 2020 9:08 PM
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసు విచారణను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. హత్య కేసుపై కింది కోర్టు విచారణను ఈ నెల 31 వరకూ నిలిపివేసింది.
ఈ మేరకు మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు ఉత్తర్వులు జారీ చేశారు. డిశ్చార్జి పిటిషన్ను కొట్టేస్తూ కింది కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే చార్జిషీటు నమోదును ఆమోదించిందని, తమకు అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వలేదని ప్రణయ్ హత్య కేసులో నాలుగో నిందితుడు హైదరాబాద్కు చెందిన మహ్మద్ అబ్దుల్బారి హైకోర్టును ఆశ్రయించారు.
చార్జిషీటు వేశాక డిశ్చార్జి పిటిషన్ ఎలా వేస్తారని హైకోర్టు ప్రశ్నకు పిటిషనర్ న్యాయవాది ప్రద్యుమ్నకుమార్ రెడ్డి స్పందిస్తూ హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు గడువు ఇవ్వాలని కోరినా కింది కోర్టు ఇవ్వలేదని, నిందితుడి డిశ్చార్జి పిటిషన్ను కొట్టేసిన రోజునే చార్జిషీటు నమోదుకు ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పారు. దీంతో కింది కోర్టులో ప్రణయ్ హత్య కేసు విచారణను ఈ నెల 31 వరకూ నిలిపివేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. విచారణను అదే తేదీకి వాయిదా వేసింది.