- హోమ్›
- వార్తలు›
- కరోనా టెస్టుల విషయంలో ముందడుగు వేసిన తెలంగాణ ..రాపిడ్ టెస్టుల ద్వారా కరోనా టెస్ట్ చేయాలని నిర్ణయం
కరోనా టెస్టుల విషయంలో ముందడుగు వేసిన తెలంగాణ ..రాపిడ్ టెస్టుల ద్వారా కరోనా టెస్ట్ చేయాలని నిర్ణయం
By: Sankar Fri, 03 July 2020 10:18 AM
తెలంగాణలో కరోనా తీవ్రత భయంకొల్పే విధంగా ఉంది ..మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే టెస్టులు తక్కువగా చేస్తున్నప్పటికీ పాజిటివ్ కేసులు మాత్రం చాలా రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నాయి .. కేసుల సంఖ్య పెరుగుతున్న వేగానికి తగ్గట్టుగా కోవిడ్ పరీక్షలు చేయడం కోసం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులను అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయించింది. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ద్వారా ఆరు గంటల్లోగా ఫలితం తెలుసుకోవచ్చు. రాష్ట్రంలో ర్యాపిడ్ టెస్టులు చేయడానికి ఐసీఎంఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడు రోజుల్లోగా టెస్టింగ్ కిట్లు ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నాయి. ముందుగా 50 వేల కిట్లను తెప్పించనున్నారు.
కరోనా నిర్ధారణ కోసం మన దేశంలో ప్రస్తుతం ఆర్టీ-పీసీఆర్, ట్రూనాట్, సీబీనాట్ టెస్టులు చేస్తున్నారు. శాంపిళ్ల సేకరణ, రవాణాకు రెండు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. ప్రభుత్వ హాస్పిటళ్లలో కరోనా పరీక్షలను ఉచితంగా చేస్తుండగా.. ప్రయివేట్ హాస్పిటళ్లు, ల్యాబ్లు రూ.2200 వసూలు చేయాలని సర్కారు ఆదేశించింది. ఈ టెస్టుల ద్వారా ఫలితం తేలడానికి ఎక్కువ సమయం పడుతోంది. దీంతో శాంపిళ్లు పేరుకుపోతుండటంతో.. తరచుగా శాంపిళ్ల సేకరణను నిలిపేయాల్సి వస్తోంది.
అయితే ఆర్టీ పీసీఆర్ టెస్టుతో పోలిస్తే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు రిజల్ట్ వేగంగా రావడమే కాదు, ఖర్చు కూడా తక్కువ. రూ.500ల్లోపు ఖర్చుతో యాంటీజెన్ టెస్టు చేసే వీలుంది. యాంటీజెన్ టెస్టు కోసం సేకరించిన నమూనాలను గంటలోపే పరీక్షించాలి. ఈ టెస్టులు చేయడానికి సాధారణ లేబోరేటీలు సరిపోతాయి. దీంతో పీహెచ్సీల్లోనూ వీటిని చేసే వీలుంది. ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్ వస్తే మరోసారి కరోనా టెస్టు చేస్తారు.