- హోమ్›
- వార్తలు›
- ఆ లెక్చరర్ విజ్ఞప్తి మేరకు ఇక నుంచి జూనియర్ , డిగ్రీ కాలేజీల్లో కూడా మధ్యాహ్న భోజన పథకం ..సీఎం కేసీఆర్
ఆ లెక్చరర్ విజ్ఞప్తి మేరకు ఇక నుంచి జూనియర్ , డిగ్రీ కాలేజీల్లో కూడా మధ్యాహ్న భోజన పథకం ..సీఎం కేసీఆర్
By: Sankar Fri, 17 July 2020 3:11 PM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నానికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీనివల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపవుట్స్ పెరిగిపోతున్నాయని కేసీఆర్ అన్నారు. ఈ పరిస్థితిని నివారించడంతో పాటు విద్యార్థులకు పౌష్ఠికాహారం ఇవ్వాలనే లక్ష్యంతో కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు.
జడ్చర్ల డిగ్రీ కాలేజీ లెక్చరర్ రఘురామ్ తన సొంత ఖర్చులతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారని సీఎం కేసీఆర్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లెక్చరర్ రఘురామ్ను సీఎం అభినందించారు. ఈ నేపథ్యంలోనే కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాల్సిన అవసరాన్ని సీఎం గుర్తించారు. రఘురామ్ విజ్ఞప్తి మేరకు జడ్చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి నూతన భవనాన్ని సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా ఇంతకుముందు జరిగిన విద్యావ్యవస్థ సమీక్షలో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బోటనీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న సదాశివయ్య, పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక హైస్కూల్ హెడ్మాస్టర్ డాక్టర్ పీర్ మహ్మద్ షేక్ గురించి సీఎంకు చెప్పారు. ఈ ఇద్దరూ తమ విద్యాసంస్థల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచుతున్నారని చెప్పారు. వారిద్దరినీ ప్రోత్సహించాలని ప్రభుత్వం పక్షాన ప్రత్యేకంగా అవార్డులివ్వాలని సీఎం నిర్ణయించారు. జడ్చర్ల డిగ్రీ కాలేజీలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతోపాటు అక్కడ తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఏర్పాటుచేయాలని సంకల్పించిన సదాశివయ్యతో సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు..