- హోమ్›
- వార్తలు›
- తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం ..ఉద్యమ నేత , తెలంగాణ తొలి హోమ్ మంత్రి నాయిని కన్నుమూత
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం ..ఉద్యమ నేత , తెలంగాణ తొలి హోమ్ మంత్రి నాయిని కన్నుమూత
By: Sankar Thu, 22 Oct 2020 09:08 AM
తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి, కార్మిక నాయకుడు, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాయిని.. బుధవారం అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో 12.25 గంటలకు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.
గత నెల 28వ తేదీన కరోనా బారినపడిన ఆయన బంజారాహిల్స్లోని సిటీన్యూరో సెంటర్ దవాఖానలో 16 రోజులపాటు చికిత్స పొందారు. వారంరోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ.. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకడంతో కుటుంబసభ్యులు అపోలో దవాఖానకు తరలించారు. అప్పటినుంచి వెంటిలేటర్పై చికిత్స పొందారు.
బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అపోలో దవాఖానలో నాయినిని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కానీ రాత్రి పొద్దుపోయాక నాయిని ఆరోగ్యం క్షీణించింది. నాయిని మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. చిరకాల మిత్రుడు, ఉద్యమ సహచరుని కోల్పోయానన్నారు. నాయిని మృతి టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ రాష్ర్టానికి, కార్మిక లోకానికి తీరనిలోటని పేర్కొన్నారు.