బెంగళూరు లో అల్లర్లతో అలెర్ట్ అయినా తెలంగాణ పోలీస్ యంత్రాంగం
By: Sankar Wed, 12 Aug 2020 9:27 PM
సోషల్ మీడియా పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్ర పౌరులకు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో విద్వేషకర, తప్పడు పోస్టులు బెంగళూరులో ఎంత విద్వేషానికి దారి తీశాయో, ఎంత ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమయ్యాయో తెలుసుకోవాలని కోరారు.
శాంతి భద్రతలను దెబ్బతీసే అలాంటి పోస్టులు పెట్టొద్దని ప్రజలను కోరుతున్నామని అన్నారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని తెలంగాణ పోలీసులు నిరంతరం గమనిస్తారని, అలాంటి వారిపై వారిపై వెంటనే కేసులు పెట్టి, తగిన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని స్టేషన్లకూ, సీనియర్ అధికారులకూ ఆదేశాలిచ్చామని తెలిపారు..
ప్రజలు పోలీసులతో సహకరించి భద్రత, రక్షణలో తెలంగాణ అత్యున్నతంగా నిలిచేలా సహకరించాలని కోరారు. ఈమేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. కాగా, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి బంధువు నవీన్ సోషల్ మీడియాలో ఓ కమ్యూనల్ పోస్టు షేర్ చేయడంతో బెంగుళూరులో తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందారు. సాధారణ పౌరులతో పాటు 60 మంది పోలీసులకు గాయాలయ్యాయి