ప్రగతిభవన్ పై మువ్వన్నెల రెపరెపలు
By: Dimple Sat, 15 Aug 2020 6:19 PM
హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ముఖ్యనాయకులు, అధికారులతో కలిసి జాతీయ పతాకం ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అంతకుముందు ఆయన మహనీయుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. దేశానికి వారి చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఆయన వెంట పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి తదితరులున్నారు.
అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో అమర వీరుల స్థూపం ముందు పుష్ఫ గుచ్ఛం ఉంచిన సీఎం.. అమర వీరులకు నివాళులు అర్పించారు. సాధారణంగా గోల్కొండ కోట వద్ద సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగరేస్తారు. కానీ ఈసారి కరోనా ప్రభావంతో సీఎం క్యాంప్ ఆఫీసు ప్రగతి భవన్లో ఈ వేడుకలను నిర్వహించారు.
సిరిసిల్ల: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో శనివారం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే ముందు వరసలో ఉందన్నారు. కరోనా కారణంగా స్వాతంత్య్ర వేడుకలు నిరాడంబరంగా నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ హెగ్డే, వివిధ శాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
నిజామాబాద్: స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత వీడియో సందేశం విడుదల చేశారు. కరోనా బాధితుల కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ తనకు స్ఫూర్తి అని తెలిపారు. వారి సంకల్ప బలానికి నా సలాం అని పేర్కొన్నారు.