కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకోవద్దు...బండి సంజయ్
By: Sankar Sun, 01 Nov 2020 7:25 PM
బీజేపీ కార్యాలయం ముందు ఆత్మహత్యయత్నానికి పాల్పడి శ్రీనివాస్ను బీజేపీ నేతలు పరామర్శించారు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడిని ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ప్రేమేందర్ రెడ్డి తదితరులు పరామర్శించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం బాధాకరం. పార్టీ కార్యకర్తగా చాలా కాలంగా శ్రీనివాస్ పనిచేస్తున్నాడు. అతడు మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. శ్రీనివాస్కు 58శాతం గాయాలు అయినట్లు వైద్యులు చెబుతున్నారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాక్షస క్రీడ ఆడుతున్నారు. ప్రశ్నించేవారిపై ప్రభుత్వం లాఠీఛార్జ్ చేసి, జైళ్లకు పంపుతోంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ధైర్యంగా పోరాడదాం. బీజేపీ కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునిస్తున్నాను. తెలంగాణలో కాషాయ జెండాను రెపరెపలాడించేవరకూ కష్టపడి పనిచేద్దాం’ అని కోరారు