తమిళనాడులో కూడా టెన్త్ పరీక్షలు రద్దు
By: chandrasekar Wed, 10 June 2020 11:39 AM
కరోనా వైరస్ కారణంగా
ఇప్పటికే అనేక పరీక్షలు రద్దు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలు రద్దు
చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం కరెక్ట్
కాదని కేసీఆర్ ప్రభుత్వం భావించింది. అందుకే ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.
అయితే తాజాగా తెలంగాణ బాటలో తమిళనాడు అడుగులు వేసింది. తమిళనాడు కూడా టెన్త్
పరీక్షలు రద్దు చేసింది.
తమిళనాడులో కూడా కరోనా
వైరస్ విజృంభిస్తుండటంతో అక్కడి ప్రభుత్వం కూడా పదో తరగతి పరీక్షలను రద్దు
చేయాలని నిర్ణయించింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం
టెన్త్ పరీక్షలు నిర్వహించకుండానే పైతరగతులకు పంపిస్తామని పేర్కొంది.
విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా పరిగణిస్తున్నామని సీఎం ప్రకటించారు. క్వాటర్లి, హాఫ్
ఇయర్ లీ పరీక్షల ఫలితాల ఆధారంగా 80 శాతం మార్కులు, హాజరు ఆధారంగా మరో 20 శాతం మార్కులు
కేటాయిస్తామని చెప్పారు.
ఇంటర్ మొదటి, రెండవ
సంవత్సరానికి సంబంధించిన సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నామని తెలిపారు.
కరోనా కారణంగా విద్యావ్యవస్థ కూడా ఇబ్బందుల్లో పడింది. అందుకే ప్రస్తుతమున్న
క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను ప్రమోట్
చేయాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
విద్యా సంస్థల ప్రారంభం
విషయంలో కూడా ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి. అటు తల్లిదండ్రుల నుంచి కూడా ఈ
సమయంలో స్కూల్స్, కాలేజీలు తెరవడం మంచిది కాదన్న అభిప్రాయం వస్తుండటంతో
ఆ విధంగా ఆలోచిస్తున్నాయి. సెప్టెంబర్ వరకు విద్యాసంస్థలు తెరిచే అవకాశం లేదని
కేంద్రం కూడా చెబుతోంది.