జగన్ సర్కార్ పండుగల సమయంలో ఉద్యోగులకు తీపి కబురు...
By: chandrasekar Sat, 24 Oct 2020 1:42 PM
ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్ రెడ్డి లాక్ డౌన్ సమయంలో తగ్గించిన ఇచ్చిన జీతాలను తిరిగి ఇచ్చేందుకు
అంగీకరించారు. అడిఫర్ జీతాలు, పెన్షన్లు, రెండు డీఏలు నవంబరు నెలలో ఇచ్చేందుకు ఒప్పుకున్నారు.
తమ సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన
సానుకూలంగా స్పందించారని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి తెలిపారు.
ఏపీ ఎన్జీవో ముఖ్య నేతలు శుక్రవారం సీఎం జగన్ను కలిశారు. అనంతరం చంద్రశేఖరరెడ్డి
మీడియాతో మాట్లాడుతూ.. కరోనా లాక్ డౌన్ కారణంగా 2 నెలల పాటు తగ్గించి
ఇచ్చిన జీతాలు తిరిగి ఇచ్చేందుకు సీఎం జగన్ అంగీకరించారని పేర్కొన్నారు. అలాగే
సీపీఎస్ అమలు, పీఆర్సీ విషయంలో కూడా సీఎం జగన్ సానుకూలంగా
స్పందించారని చంద్రశేఖరరెడ్డి తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్
చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు చెప్పారు.
ప్రతి ఉద్యోగికి రిటైర్డ్
అయ్యే లోపు ఇంటి స్థలాలను ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. అలాగే కరోనా సోకిన
ఉద్యోగులకు 30 రోజులు ప్రత్యేక సెలవు ఇవ్వాలని కోరగా, సీఎం
జగన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. అడిఫర్ జీతాలు, పెన్షన్లు, రెండు
డీఏలు నవంబరు నెలలో ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఉద్యోగులకు అన్ని రకాల
సౌకర్యాలు, రాయితీలు ఇవ్వటానికి సీఎం జగన్ అంగీకరించారని సంతోషం
వ్యక్తం చేశారు. ఇక నాలుగో తరగతి ఉద్యోగుల వయో పరిమితిని 62
ఏళ్లకు పెంచేందుకు ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా ఉన్నారని సంఘం ప్రధాన కార్యదర్శి
బండి శ్రీనివాసరావు తెలిపారు. మహిళా ఉద్యోగులకు 5 రోజులు సెలవులు ఇవ్వాలని
కోరామని తెలిపారు. తమ సమస్యలకు సానుకూలంగా స్పందించిన సీఎం జగన్కు ఉద్యోగులందరి
తరఫున ధన్యవాదాలు తెలిపారు.