సుశాంత్ కేసులో కీలక మలుపు ..రియా తమ్ముడు అరెస్ట్
By: Sankar Fri, 04 Sept 2020 10:27 PM
సుశాంత్ సూసైడ్ కేసు రోజు రోజుకు మలుపులు తిరుగుతోంది. రియానే సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు చేసిందంటూ అతడి కుటుంబసభ్యులు ఆరోపించడంతో పోలీసులు ఆ దిశగా విచారణ జరిపారు. ఇక సుశాంత్ డ్రగ్స్ తీసుకున్నట్టు రుజువుకావడంతో డ్రగ్స్ కోణంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) పలువురిని విచారించింది.
అందులో భాగంగానే రియా తమ్ముడు షోవిక్ చక్రవర్తిని, సుశాంత్ హౌజ్ మేనేజర్ శామ్యూల్ ను విచారించింది. విచారణలో షోవిక్ సంచలన విషయాలు వెల్లడించినట్టు తెలుస్తుంది. రియానే పదే పదే సుశాంత్ కోసం డ్రగ్స్ తీసుకురమ్మని అడిగేదని విచారణలో షోవిక్ తెలిపారు. ఇక షోవిక్ డ్రగ్స్ సరఫరా చేయడమే కాకుండా డ్రగ్స్ అమ్మేవారితో సంబంధాలను కలిగి ఉండటంతో అతడిని అరెస్ట్ చేసారు.
కాగా శామ్యూల్ మిరాండా సుశాంత్ సింగ్ ఇంటిలో హౌస్ కీపింగ్ మేనేజర్గా పని చేసేవాడు. ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహారాలు అతడే చూసుకునేవాడు. గత ఏడాది మేలో రియా అతనిని సుశాంత్ ఇంటిలో మేనేజర్గా నియమించింది..మొదటి నుంచి సుశాంత్ కుటుంబ సభ్యులు అతనిపై ఆరోపణలు చేస్తున్నారు. సుశాంత్ డబ్బును కాజేయడంలో రియాకు అతడు సహాయం అందించాడని వారు ఫిర్యాదు చేశారు. ఇక శామ్యూల్తో పాటు ముంబైకు చెందిన జైద్ విలాత్రాను కూడా ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఉన్నత స్థాయి వర్గాలకు చెందిన వారు జరుపుకునే పార్టీలలో డ్రగ్స్ సరఫరా చేసేవాడనే ఆరోపణలు ఉండటంతో జైద్ను అదుపులోకి తీసుకున్నారు.