కోహ్లీకి కళ్ళతోనే సమాధానం చెప్పిన సూర్య కుమార్ యాదవ్.. వైరల్ అవుతున్న వీడియో
By: Sankar Thu, 29 Oct 2020 8:05 PM
ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ నిన్న ఆర్సీబి తో జరిగిన మ్యాచ్ లో ఒంటిచేత్తో ముంబై జట్టుకు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే...
కాగా ఈ మ్యాచ్ సందర్బంగా కోహ్లి, సూర్యకుమార్ మధ్య ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో దూకుతుడుగా ఆడుతూ బెంగళూరు జట్టు పతనాన్ని శాసించే విధంగా చెలరేగిపోతున్న సూర్యకుమార్, తనను తీక్షణంగా చూస్తున్న కోహ్లికి కళ్లతోనే బదులిచ్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ క్రమంలో.. అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నా జాతీయ జట్టు సెలక్షన్లో తనను పరిగణనలోకి తీసుకోకపోవడం వెనుక కారణాలేమిటని సూర్యకుమార్, కోహ్లిని కళ్లతోనే ప్రశ్నిస్తున్నాడని, ఈ చూపుల యుద్ధంలో ఆఖరికి అతడే గెలిచాడని తమకు తోచిన విధంగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
దేశవాళి, ఐపీఎల్ టోర్నీల్లో మెరుగ్గా రాణిస్తున్నా తనను పక్కకు పెట్టిన వాళ్లు ఇప్పటికేనా కళ్లు తెరవాలంటూ హితవు పలుకుతున్నారు. కాగా బుధవారం నాటి అద్భుత ఇన్నింగ్స్ తర్వాత టీమిండియా మాజీ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, క్రిష్ణమాచారి శ్రీకాంత్, అభిమానులు సూర్యకుమార్పై ప్రశంసల వర్షం కురిపించారు.