ఇండియన్ క్రికెట్ లో మరొక షాక్ ..ధోని బాటలోనే తాను కూడా రిటైర్మెంట్ ప్రకటించిన రైనా
By: Sankar Sat, 15 Aug 2020 10:28 PM
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే మరో సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా కూడా ఇంటర్నేషనల్ క్రికెట్కి గుడ్ బై చెప్పేశాడు. ధోనీతో కలిసి చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్నకి శనివారం హాజరైన సురేశ్ రైనా.. చివరిగా 2018లో భారత్ తరఫున మ్యాచ్లు ఆడాడు. ధోనీ కెప్టెన్గా ఉన్న రోజుల్లో టీమిండియాలో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగిన సురేశ్ రైనా.. విరాట్ కోహ్లీ చేతికి పగ్గాలు వచ్చిన తర్వాత జట్టుకి క్రమంగా దూరమైపోయాడు.
34 ఏళ్ల రైనా ఉత్తర్ప్రదేశ్లోని ఘజియాబాద్లో జన్మింంచాడు. 2005లో టీమిండియాలో స్థానం సంపాదించిన రైనా వన్డే ఫార్మాట్లో జట్టుకు ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. రెండు ప్రపంచ కప్లు ఆడిన అనుభవం అతని సొంతం. సుదీర్ఘ కెరీర్లో కేవలం 18 టెస్ట్ మ్యాచ్లే ఆడిన రైనా 768 పరుగులు సాధించాడు. దాంట్లో ఓ సెంచరీ కూడా ఉంది.
ఇక 226 వన్డే మ్యాచ్లకు ప్రాతినిథ్యం వహించిన ఈ లెఫ్ట్ హ్యాండర్ ఐదు శతకాలు, 36 అర్థ శతకాలతో 5615 పరుగులు చేశాడు. ఇక టీ-20 ఫార్మాట్లో రైనా మంచి ఫామ్ కొనసాగించాడు. టీమిండియా తరఫున 78 మ్యాచ్లు ఆడి 1600కు పరుగులు చేశాడు. వన్డే, టెస్ట్,టీ-20 అన్ని ఫార్మాట్లో భారత్ తరఫున సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్గా రైనా రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం జట్టు సభ్యులతో కలిసి దుబాయ్లో ఉన్నాడు