ఎల్జీ పాలిమర్స్ తెరిచేందుకు సుప్రీంకోర్టు పర్మిషన్
By: chandrasekar Wed, 27 May 2020 3:01 PM
విశాఖపట్నంలోని ఎల్జీ
పాలిమర్స్ సంస్థ కర్మాగారాన్ని అత్యవసరంగా తెరిచేందుకు,
30 మంది సిబ్బంది ఆ భవనంలోకి వెళ్లేందుకు సుప్రీంకోర్టు
పర్మిషన్ ఇచ్చింది. ఈ కర్మాగారంలో విషతుల్యమైన పాలిమర్స్ ఉన్నాయన్న సంస్థ వాదన
మేరకు అనుమతి మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.
గ్యాస్ లీక్ వ్యవహారంపై
రకరకాల కమిటీలను నియమించారని, తాము
ఎంత మంది ముందు హాజరు కావాలని సంస్థ అడగ్గా ఈ విషయాలను హైకోర్టుకే నివేదించాలని
సూచించింది.
కర్మాగారంలోకి ప్రవేశించే
30 మంది సిబ్బంది వివరాలను 26వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకల్లా విశాఖపట్నం జిల్లా కలెక్టర్కు అందించాలని
ఆదేశించింది.
ఎల్జీ పాలిమర్స్ సంస్థ
తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ తమపై 7 రకాల విచారణలు జరుగుతున్నాయని, వాటన్నింటికీ తాము ఎలా హాజరు కాగలమని అడిగారు. తాము
అన్ని విధాలా సహకరిస్తామని, తాము
ఎక్కడికీ పారిపోవటం లేదని అన్నారు.
హైకోర్టు తమ ప్లాంటును
సీజ్ చేసిందని, ప్లాంటును
మూసేయడం చాలా ప్రమాదకరమని, మరిన్ని
సమస్యలు వస్తాయని తెలిపారు. ఆ ప్లాంటును తక్షణం తెరవాల్సి ఉందని చెప్పారు. ఎన్జీటీ
ఆదేశాలు, హైకోర్టు ఆదేశాలు, చట్టపరమైన
అంశాల నేపథ్యంలోనే తాము సుప్రీంకోర్టును ఆదేశించాల్సి వచ్చిందని, తమ పరిస్థితి ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడిన
చందంగా మారిందన్నారు. హైకోర్టే ఒక కమిటీలాగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఇప్పుడు తమ
ప్లాంటులోకి హైకోర్టు సూచించినవారు తప్ప మరెవరూ వెళ్లే పరిస్థితి లేదని, ఈ విషయంపై తమకు మాట్లాడే అవకాశాన్ని కూడా హైకోర్టు
ఇవ్వలేదని వివరించారు.