చెలరేగిన బౌలర్లు ..బోణి కొట్టిన వార్నర్ సేన
By: Sankar Wed, 30 Sept 2020 07:29 AM
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బోణి కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ పై 15 పరుగులతో విజయం సాధించింది. 163 రన్స్ టార్గెట్ ఛేదించడంలో ఢిల్లీ బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. సన్ రైజర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో ఢిల్లీ జట్టుకు ఇదే తొలి ఓటమి.
వరుసగా రెండు విజయాలతో దూసుకుపోయిన ఢిల్లీ క్యాపిటల్స్కు షాక్ ఇచ్చింది సన్ రైజర్స్. శ్రేయస్ అయ్యర్ సేనపై గెలిచి ఈ ఐపీఎల్ సీజన్లో బోణి కొట్టింది వార్నర్ సేన. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. సన్ రైజర్స్ జట్టులో ఓపెనర్లు రాణించారు. బెయిర్ స్టో 53, కెప్టెన్ వార్నర్ 45 పరుగులు చేశారు.
మనీశ్ పాండే ఫెయిలైనా చివర్లో విలియమ్ సన్ దూకుడుగా ఆడాడు. 26 బంతుల్లో 41 పరుగులు చేశాడు. సన్రైజర్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 162 రన్స్ చేసింది. ఛేజింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్కు తొలి ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది. పృధ్వీ షా 2 పరుగులే చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత సన్రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ధావన్, అయ్యర్ వేగంగా పరుగులు చేయలేకపోయారు.
ముఖ్యంగా రషీద్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ధావన్, అయ్యర్తో పాటు ప్రమాదకర బ్యాట్స్ మెన్ పంత్ను రషీద్ ఖాన్ అవుట్ చేశాడు. హిట్ మెయిర్, స్టోయినిస్లు కూడా పెద్దగా రాణించలేకపోయారు. దీంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విక్టరీతో వార్నర్ సేన బోణి కొట్టగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో తొలి ఓటమి నమోదైంది.