నరైన్ బౌలింగ్ యాక్షన్ పై ఫిర్యాదు చేసిన అంపైర్లు
By: Sankar Sun, 11 Oct 2020 12:45 PM
ఐపీఎల్ 2020 లో కోల్కత నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ పై బీసీసీఐ లో ఫిర్యాదు నమోదయ్యింది. నిన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్- కోల్కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో నరైన్ స్పిన్ మాయాజాలంతో కేకేఆర్ విజయం సాధించింది.
పంజాబ్ జట్టుకు 18 బంతుల్లో 25 పరుగులు కావాల్సిన సమయంలో నరైన్ తన స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టును దెబ్బతీశాడు. తాను వేసిన 18 వ ఓవర్లో 2 పరుగులు ఇవ్వడం మాత్రమే కాకుండా ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. అలాగే చివరి ఓవర్లో పంజాబ్ కు 14 పరుగులు కావాల్సిన సమయంలో నరైన్ 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దాంతో కేకేఆర్ విజయం సాధించింది. కానీ ఈ మ్యాచ్ లో నరైన్ బౌలింగ్ ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఆన్ఫీల్డ్ అంపైర్లు క్రిస్ గఫెనీ, ఉల్హాస్ బీసీసీఐకి ఫిర్యాదు చేశారు.
దాంతో బీసీసీఐ నరైన్ ను హెచ్చరిక జాబితాలో ఉంచుతున్నట్లు తెలిపి అతను ప్రస్తుతం బౌలింగ్ వేయవచ్చు అని స్పష్టం చేసింది. కానీ మరోసారి ఇలా ఫిర్యాదు వస్తే బీసీసీఐ అనుమతించేవరకు నరైన్ బౌలింగ్ వేసే అవకాశం ఉండదు అని ఆ ప్రకటనలో తెలిపింది. అయితే గతంలో కూడా పలుమార్లు నరైన్ బౌలింగ్ శైలి పై ఫిర్యాదులు వచ్చాయి.