సండే స్పెషల్ :ఆవ నూనెతో మటన్ కర్రీ
By: Sankar Sun, 16 Aug 2020 2:41 PM
సండే వచ్చింది అంటే చాలు చాలా మంది ఇళ్లలో మటన్ గుమగుమలు వస్తాయి..అయితే ఎప్పుడు సన్ ఫ్లవర్ లేదా పామాయిల్ తోనే మటన్ కర్రీ చేసి ఉంటారు..అయితే ఆవ నూనెతో కూడా మటన్ కర్రీ చేస్తే అద్భుతంగా ఉంటుంది.మరి ఆ నూనెతో ప్రెషర్ కుక్కర్లో మటన్ కర్రీ వండితే ఎలా ఉంటుందో ఒకసారి ప్రయత్నించి చూడండి.
కావాల్సిన పదార్ధాలు :
మటన్ - కిలో, ఉల్లిపాయలు (పెద్దవి)-అయిదు, పెరుగు - ఒక స్పూను, పసుపు - పావు స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను, బంగాళాదుంప (పెద్దది) - ఒకటి, టొమోటొ - ఒకటి, పచ్చిమిరపకాయలు - నాలుగు, మసాలా దినుసులు - తగినన్ని, ఆవనూనె - సరిపడా, ఉప్పు - తగినంత, ధనియాల పొడి, జీలకర్ర పొడి - చెరో చిటికెడు.
తయారీ విధానం :
1. ప్రెషర్ కుక్కర్ స్టౌ మీద పెట్టి కూరకి సరిపడా ఆవనూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక మసాలా దినుసులైన లవంగాలు, దాల్చిన చెక్క , యాలకులు వేసి వేపి, వాటికి పచ్చి మిరపకాయలు చేర్చాలి.
2. ముందుగా నిలువుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి వేపాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్టుని వేయాలి.
3. ఇప్పడు కోసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, పసుపు, ధనియాలు, జీలకర్ర పొడులు వేసి వేపాలి. సుమారు అయిదు నిమిషాల పాటూ వేపాక మారినేషన్ చేసిన మటన్ ముక్కల్ని వేసి కలపాలి.
4. సుమారు ఇరవై నిమిషాల పాటూ మూతపెట్టకుండానే ఉడకించాలి. రెండు నిమిషాలకోసారి కలుపుతూ ఉండాలి.
5. ఇప్పుడు వేయించిన బంగాళా దుంప ముక్కలు, స్పైసీగా కావాలనుకుంటే కాస్త గరం మసాలా, కారం పొడి వేసుకోవాలి. గ్రేవీ కోసం వేడి నీటిని పోయాలి.
6. ఇప్పడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి, సుమారు ఆరు విజిల్స్ వచ్చాక ఆపాలి. మూత తీశాక పొగలు గక్కుతున్న మటన్ కర్రీలో కాస్త నెయ్యి కలిపి అన్నంతో తింటే రుచి అదిరిపోతుంది.