తొలి పోరులో కోహ్లీ సేనను ఢీకొట్టనున్న వార్నర్ దళం
By: Sankar Mon, 21 Sept 2020 09:41 AM
ఐపీఎల్ 13వ సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది... రెండు మ్యాచ్లు పూర్తయ్యాయి... అయితే ఈ సీజన్లో తొలిపోరుకు సన్రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరును దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఢీకొననుంది.
2016లో జట్టుకు తొలి టైటిల్ అందించిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్ రెండేళ్ల తర్వాత మళ్లీ కెప్టెన్ పగ్గాలు చేపట్టగా.. జానీ బెయిర్స్టో, కేన్ విలియమ్సన్, మనీశ్ పాండే, మిచెల్ మార్ష్లతో హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. ఇటీవల సీపీఎల్లో అదరగొట్టిన ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, ఆల్రౌండర్ మహమ్మద్ నబీ, భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్తో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ వైవిధ్యంగా ఉంది.
మరోవైపు గతేడాది పాయింట్ల పట్టికలో చివర్లో నిలిచిన బెంగళూరు శుభారంభం చేయాలని పట్టుదలతో ఉంది. స్టార్ ప్లేయర్లు కెప్టెన్ కోహ్లీ, డివిలియర్స్కు ఫించ్, మోరిస్ తోడవడంతో మరింత బలోపేతమైంది. భారత స్పిన్నర్ యజువేంద్ర చాహల్, సుందర్, మొయిన్ అలీ, ఆడమ్ జంపా రూపంలో కోహ్లీకి అనేక స్పిన్ ఆప్షన్లు ఉన్నాయి. కాగా దుబాయ్ పిచ్ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉంది.