మంత్రి కేటీఆర్ పై ఫిర్యాదు చేసిన సుమేధ తల్లితండ్రులు
By: Sankar Mon, 21 Sept 2020 6:51 PM
ఓపెన్ నాలాలో పడి మృతి చెందిన సుమేధ కపూరియా (12) తల్లిదండ్రులు సోమవారం నేరేడ్మెట్ పోలీసులను కలిశారు. ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని పేర్కొంటూ.. మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్, స్థానిక కార్పొరేటర్, సంబంధిత ఏఈ, డీఈలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
వీరందరిపై ఐపీసీ సెక్షన్ 304 ప్రకారం కేసు నమోదు చేయాలని ఈ మేరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు సమర్పించారు. కాగా, నేరేడ్మెట్లోని కాకతీయ నగర్లో నివాసముండే అభిజిత్, సుకన్య దంపతుల కుమార్తె సుమేధ గత గురువారం సాయంత్రం సైకిల్ తొక్కుకుంటూ బయటికెళ్లింది. దీన్దయాళ్ నగర్లోని ఓపెన్ నాలాలో ప్రమాదవశాత్తూ పడి మరణించింది. వరద ఉధృతికి బాలిక మృతదేహం బండచెరువుకు కొట్టుకొచ్చింది.
కాగా నిన్న సరూర్ నగర్ లో కూడా ఒక వ్యక్తి స్కూటీ మీద వెళుతూ వరద నీటిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే..దాదాపు 20 గంటల తర్వాత ఆ వ్యక్తి మృతదేహం దొరికింది..ఇలా వరుసగా హైదరాబాద్ లో వరుసగా ప్రమాదాలలో మరణాలు సంబవిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు..