కరోనా నేపథ్యంలో యూకేలో అత్యంత కఠిన ఆంక్షలు
By: Sankar Wed, 16 Dec 2020 12:34 PM
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది...అమెరికా లో ఇంకా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి ..ఇండియా లో కరోనా కేసులు కొద్దిగా తగ్గిన్నప్పటికీ, తిరిగి మళ్ళీ కేసులు పెరిగే అవకాశం ఉంది అని నిపుణులు ఆందోళన చెందుతున్నారు..
ఇక కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో లండన్లో బుధవారం నుంచి అత్యంత కఠిన స్థాయి ఆంక్షలను(టయర్ 3) విధించాలని యూకే ప్రభుత్వం నిర్ణయించింది. అకస్మాత్తుగా కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరగడానికి తాజాగా గుర్తించిన కొత్త తరహా కరోనా వైరసే కారణమని భావిస్తున్నారు. లండన్తో పాటు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వేగవంతమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ప్రతినిధుల సభలో ఆరోగ్య శాఖ మంత్రి మాట్ హాన్కాక్ వివరించారు ..
టయర్ త్రీ లో దాదాపు పూర్తి స్థాయి లాక్డౌన్తో సమానమైన ఆంక్షలుంటాయి. ‘ఇక్కడ కొత్త తరహా కరోనా వైరస్ను గుర్తించారు.ఆగ్నేయ ఇంగ్లండ్ ప్రాంతంలో కరోనా కేసుల సంఖ్య అకస్మాత్తుగా, వేగంగా పెరగడానికి ఈ కొత్త తరహా వైరస్ కారణం కావచ్చని భావిస్తున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు వేగంగా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సి ఉంది’ అని హాన్కాక్ పార్లమెంట్కు తెలిపారు. దాదాపు వెయ్యికి పైగా కేసుల్లో కొత్త వైరస్ వేరియంట్ను గుర్తించారని, అందులో అధికభాగం దక్షిణ ఇంగ్లండ్ ప్రాంతంలోనే నమోదయ్యాయని వివరించారు.