జూబ్లీహిల్స్ లో భారీ వర్షం దాటికి నాలుగంతస్థుల భవనంపై పడిన కొండరాళ్లు ..
By: Sankar Sun, 02 Aug 2020 07:55 AM
హైదరాబాద్ నగరంలో పలు చోట్ల శనివారం భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో పాటు బలమైన ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, పంజాగుట్ట, కూకట్పల్లి, మైత్రీవనం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
కూకట్పల్లిలో గరిష్టంగా 4.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అలానే కొన్ని చోట్ల విద్యుత్కి అంతరాయం ఏర్పడింది. కాగా గత కొద్ది రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే.
కాగా వర్షం కారణంగా జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45లో ఓ ప్రమాదం చోటుచేసుకుంది. వర్షం ధాటికి పెద్ద పెద్ద రాళ్లు ఇళ్లపై పడటం తీవ్ర భయాందోళన కలిగించింది. స్థానికుల సమాచారం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44 ఓ కాంట్రాక్టర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా 20 అడుగులు ఉన్న కొండను తవ్వాడు. ఈ క్రమంలోనే భారీ వర్షం సంభవించడంతో ఒక్కసారిగా పెద్ద బండలతో ఉన్న కొండ కూలి పక్కనే ఉన్న నాలుగు అంతస్థుల భవనంపై పడింది.
ఇంట్లోని సామగ్రి ధ్వంసమవ్వగా.. నాలుగు అంతస్థుల భవనం పూర్తిగా దెబ్బతిన్నది. ఒక్కసారిగా పెద్దగా శబ్ధం రావడంతో భవనంలో ఉన్న వారంతా బయటకు పరుగులు తీశారు. భవనం బలంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని అక్కడున్న వారు వాపోతున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని.. బాధితులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.