Advertisement

  • మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన రాష్ట్ర ఎలక్షన్‌ కమిషన్...

మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన రాష్ట్ర ఎలక్షన్‌ కమిషన్...

By: chandrasekar Wed, 18 Nov 2020 3:56 PM

మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన రాష్ట్ర ఎలక్షన్‌ కమిషన్...


రాష్ట్ర ఎలక్షన్‌ కమిషన్ హైదరాబాద్‌ మహానగర మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను ముగించే విధంగా షెడ్యూల్‌ను ఖరారు చేసింది. డిసెంబర్‌ ఒకటిన పోలింగ్‌, నాలుగున కౌంటింగ్‌తో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముగియనున్నాయి. దీంతో నగరంలోని 150 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. గత కొంత కాలంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై జరుగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ ఎన్నికల ప్రకటన రావటంతో రాజకీయపార్టీల్లో ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. ప్రధాన పార్టీలు అస్త్ర,శస్త్రాలకు పదును పెడుతున్నాయి. రాష్ట్రంలో ఏర్పడిన తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నికలు అనగానే రాజకీయపార్టీలు తమవైన విధానాలతో, అభివృద్ధి ప్రణాళికలతో ప్రజల ముందుకు పోవటం సహజం. కానీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల క్రమంలో రాష్ట్రంలోని విపక్ష పార్టీల తీరు పరమ వికృతంగా ఉన్నది. ఇన్నాళ్లూ తెలంగాణ అభివృద్ధి, ప్రజాసామరస్యం, సుస్థిర పాలన అంటే గిట్టని, ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోతున్న శక్తులు కలుగుల్లోంచి బయటకు వస్తున్నాయి. ఒకరు కులం కార్డు బయటకు తీస్తే, మరొకరు మతం రంగుపూసుకొని సహజీవన సంస్కృతిలో చిచ్చు రేపేందుకు కుట్రలు పన్నుతున్నారు.

నగరప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు కాలు కదుపుతున్నారు. స్వీయపాలనా అనుభూతితో ఆత్మగౌరవంతో ఐకమత్యంగా ఉన్న ప్రజలను రకరకాల పేర్లతో విచ్ఛిన్నం చేయటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. సుదీర్ఘ పోరాటాలతో అనన్య త్యాగాలతో రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ ప్రజలు రాయంచలా పాలను, నీళ్లను వేరు చేసి, విద్వేష రాజకీయాలకు పాతరేయటం ఖాయం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండోసారి జరుగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ప్రాధాన్యమున్నది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆత్మగౌరవ స్వీయపాలనా విధానాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలకూ; అబద్ధాల పునాదులపై విద్వేష రాజకీయాలకు మధ్యన పోరు జరుగుతున్నది. ఈ ఐదేండ్ల పాలనలో అమలైన అభివృద్ధి సంక్షేమ పథకాలు రాష్ర్టాన్ని అన్నింటా ఆదర్శంగా నిలిపాయి. ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి. గతంలో ముఠా, మతవిద్వేష రాజకీయాల కారణంగా మతకలహాలకు నెలవైన రాజధాని ప్రస్తుతం బ్రాండ్‌ హైదరాబాద్‌గా మారింది. ప్రపంచ దేశాల నుంచి బహుళజాతి కంపెనీలన్నీ భాగ్యనగరం వైపు చూస్తున్నాయి. వేల కోట్ల పెట్టుబడులతో క్యూ కడుతున్నాయి. ఇవాళ హైదరాబాద్‌ రాష్ట్ర రాజధాని మాత్రమే కాదు, ఓ విశ్వనగరం.

Tags :

Advertisement