సీఎంఆర్ షాపింగ్ మాల్లో పనిచేస్తున్న సిబ్బందే చోరీ
By: chandrasekar Sat, 27 June 2020 1:37 PM
మహబూబ్ నగర్లో ఈ ఘటన
జరిగింది. షాపింగ్ మాల్లో పని చేసే సిబ్బంది అందులోని విలువైన బంగారు ఆభరణాలనే
దొంగిలించడం కలకలం రేపుతోంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సీఎంఆర్ షాపింగ్
మాల్లో కొద్ది రోజుల క్రితం చోరీ జరిగింది. మాల్ నిర్వహకులు పోలీసులకు సమాచారం
ఇవ్వడంతో వారు విచారణ జరిపి ఈ కేసును ఛేదించారు.
షాపింగ్ మాల్లో పనిచేస్తున్న
సిబ్బందే విలువైన ఆభరణాలు, నగదును దొంగిలించారని గుర్తించారు. అంతేకాక, నగలు
కాజేసిన ఏడుగురు నిందితులను మహబూబ్ నగర్ వన్ టౌన్ పోలీసులు అదుపులోకి
తీసుకున్నారు. వారి వద్ద నుంచి 38 తులాల బంగారు నగలు, రూ.6 లక్షల
నగదును స్వాధీనం చేసుకున్నారు.
కేసు వివరాలను జిల్లా
ఎస్పీ రెమా రాజేశ్వరి శుక్రవారం మీడియాకి వెల్లడించారు. సిబ్బంది చేతివాటం
ప్రదర్శించి కొట్టేసిన వాటిలో బంగారు వడ్డాణాలు, నెక్లెస్ సెట్లు, బంగారు
గొలుసులు, ఉంగరాలు
ఉండడం గమనార్హం. అంతేకాక, ఈ ఏడుగురు రూ.6 లక్షల నగదును కూడా దొంగిలించారు. విచారణలో భాగంగా
మాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించడం, సిబ్బందిని ప్రశ్నించడం వంటివి చేసి పోలీసులు ఇది పనిచేస్తున్న
సిబ్బంది పనే అని తేల్చారు.