శ్రీశైలం పవర్ ప్లాంట్ అగ్ని ప్రమాద ఘటనలో కీలక అంశాలు వెల్లడించిన సీఐడీ
By: Sankar Fri, 28 Aug 2020 3:17 PM
శ్రీశైలం పవర్ హౌజ్ ప్రమాదంపై సీఐడీ బృందం దర్యాప్తును ముమ్మరంగా చేసింది. విచారణలో భాగంగా నిన్న మరోసారి శ్రీశైలం వెళ్లిన సీఐడీ బృందం నేడు (శుక్రవారం) సంఘటన స్థలంలో పనిచేస్తున్న ఉద్యోగులను విచారిస్తోంది.
ఇప్పటికే ప్రమాద ఘటనపై పలు ఆధారాలు సేకరించిన బృందం సభ్యులు ప్రమాద ఘటనపై శాఖా పరమైన విచారణ పూర్తి చేసింది. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయట పడ్డ ఉద్యోగుల నుంచి పవర్ ప్లాంట్కు సంబంధించిన విషయాలు, ప్రమాద కారణాలను సేకరిస్తోంది. మరికొద్ది రోజుల్లో ప్రమాద జరిగిన తీరు, కారణాలపై సీఐడీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.
కాగా, పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాదం ఘటనపై శ్రీశైలం ప్లాంట్ ఇంచార్జ్ ఉమా మహేశ్వర చారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ప్రకారం.. ఆగస్టు 20 వ తేదీ రాత్రి 10 గంటల 20 నిమిషాలకు ప్రాజెక్టులో ప్రమాదం జరిగింది. హైడ్రో పవర్ టన్నెల్లో పని జరుగుతున్న సమయంలో సడన్గా మెషీన్లో ప్రమాదం సంభవించింది. ఏఈ, డిఈ , ఏఏఈ లతో పాటు మొత్తం 9 మంది సిబ్బంది మృతి చెందారు.
చనిపోయిన వారిలో ప్రాజెక్టులో బ్యాటరీలు అమర్చడానికి వచ్చిన అమర్ రాజ కంపెనీకి చెందిన ఇద్దరు మెకానిక్లు కూడా ఉన్నారు. టర్బైన్ వేగం పెరగడం వల్ల ప్యానెల్ యూనిట్స్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన పవర్ హౌస్ జనరేటర్లు. కేబుల్, ప్యానెల్స్, బ్యాటరీ చేంజ్ చేసేటపుడు న్యూకిలెన్స్ న్యూట్రల్గా మారకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని సీఐడీ బృందం ప్రాథమిక అంచనాకొచ్చింది.