శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాలను మరో వారం పాటు నిలుపదల
By: chandrasekar Mon, 03 Aug 2020 09:24 AM
రాష్ట్రంలో కరోనా కేసులు
అధికమవుతున్న కారణంగానూ మరియు శ్రీశైలంలో కూడా పాజిటివ్ కేసులు నమోదవుతున్న
కారణంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాలను మరో వారం పాటు
నిలుపదల చేస్తూ ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఈ
నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.
శ్రీశైలంకు వచ్చే భక్తులు
ముందస్తు సమాచారం తెలుసుకోకుండా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ముందస్తు చర్యలు
తీసుకుంటున్నప్పటికీ శ్రీశైలంలో పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన
కలిగిస్తున్న కారణంగా దర్శనాలు నిలుపుదలకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరోనా
కేసులు పెరుగుతున్నందున శ్రీశైలంలో భక్తులకు ఇప్పట్లో అనుమతి ఇవ్వమని ఆలయ ఈఓ కేఎస్
రామారావు ప్రకటించారు.
క్షేత్ర పరిధిలో
రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులను కట్టుదిట్టం చేసేందుకు
తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మరో వారంపాటు ఆలయ ప్రవేశానికి అనుమతులివ్వబోమని
చెప్పారు. ఇప్పటి వరకు పలువురు దేవస్థానం ఉద్యోగులతోపాటు స్థానికులు కూడా వైరస్
లక్షణాలతో భాదపడుతున్నందున వైద్యాధికారుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన
చెప్పారు.
శ్రీశైలంలోని ఉభయ
దేవాలయాల్లో స్వామివార్లకు జరిగే నిత్య కైంకర్యాలు అర్చక వేదపండితులచే ఏకాంతంగా
జరుగుతాయని, అదేవిధంగా భక్తుల గోత్ర నామాలతో జరిపించే పరోక్షసేవలు
ఎప్పటిమాదిరిగా కొనసాగుతాయని ఈఓ తెలియజేసారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి
దర్శనాలకు వస్తున్న వారు ముందస్తు సమాచారం తెలుసుకోకుండా క్షేత్రానికి రావద్దని
కోరారు. సాక్షి గణపతి ఆలయం వద్దకు నిత్యం వస్తున్న వాహనదారులను వెనుదిప్పి
పంపుతున్నట్లు ఆలయ భద్రతా అధికారి శ్రీనివాసరావు తెలియజేసారు.