రెండు నెలల విరామం తర్వాత మైదానం లో క్రికెటర్లు ...
By: Sankar Sun, 31 May 2020 4:04 PM
కరోనా కారణంగా దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ కి దూరంగా ఉన్న ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే మళ్ళీ మైదానం బాట పడుతున్నారు ..ఇప్పటికే ఇంగ్లాండ్ , వెస్ట్ఇండీస్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్కు ఆమోదం తెలుపగా తాజాగా శ్రీలంక బోర్డు కూడా ముందడుగు వేసింది ..
ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తుంటే త్వరలోనే క్రికెట్ మ్యాచ్లు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బౌలర్ల కోసం ప్రత్యేకంగా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసింది. ఇంగ్లండ్ బాటలో మరిన్ని దేశాలు పయనించేందుకు సిద్దమవుతున్నాయి.
తాజాగా శ్రీలంక తమ ఆటగాళ్ల కోసం ముఖ్యంగా బౌలర్ల కోసం ట్రెయినింగ్ సెషన్ ఏర్పాటు చేసింది. ఈ శిక్షణా శిబిరం సోమవారం నుంచి ప్రారంభం కానుందని, ఇందులో 13 మంది క్రికెటర్లు పాల్గొంటున్నారని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది. కొలంబో క్రికెట్ క్లబ్లో 12 రోజుల పాటు సాగనుందని వివరించింది. అంతేకాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఇక అన్నీ కుదిరితే జులైలో స్వదేశంలో టీమిండియాతో వన్డే/టీ20 సిరీస్ నిర్వహించాలని శ్రీలంక భావిస్తోంది. అయితే కరోనా పరిస్థితులు, అంతర్జాతీయ సర్వీసుల పునరుద్దరణ తర్వాతే తమ నిర్ణయం ఏంటో చెప్పగలమని బీసీసీఐ తేల్చిచెప్పింది. ఇక దక్షిణాఫ్రికా కూడా క్రికెట్ పునరుద్దరణ చర్యలు చేపట్టింది. ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా వేర్వేరు మైదానాల్లో తమ ఆటగాళ్ల కోసం ట్రైయినింగ్ సెషన్స్ ఏర్పాటు చేయాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది.