ఉస్మానియా ఆస్పత్రి వ్యవహారంలో కాంగ్రెస్ పై శ్రీనివాసగౌడ్ విమర్శ
By: chandrasekar Fri, 17 July 2020 10:41 AM
వర్షం కారణంగా ఉస్మానియా
ఆస్పత్రిలో నీళ్లు వస్తే కాంగ్రెస్, బీజేపీలు బురద రాజకీయం చేస్తున్నాయని మంత్రి
శ్రీనివాసగౌడ్ విమర్శించారు. 70 ఏళ్లలో ఉస్మానియా ఆస్పత్రి గురించి ఏనాడైనా
కాంగ్రెస్ నేతలు ఆలోచించారా అని ఆయన ప్రశ్నించారు. ఇన్నేళ్లు ఉత్తమ్ ఏం చేశారని
అన్నారు. ఏనాడైనా గతంలో ఉత్తమ్ ఉస్మానియాను సందర్శించారా ? అని
శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ముందు చూపుతో 2015లోనే
ఉస్మానియాకు కొత్త భవనాన్ని ప్రతిపాదిస్తే అడ్డుకున్నదెవరు అని నిలదీశారు.
అలాంటివాళ్లు ఇప్పుడు ఎగిరెగిరి మాట్లాడుతున్నారు అంటూ విమర్శించారు.
గతంలో కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, ఉత్తమ్, భట్టి
అందరూ ఉస్మానియాకు కొత్త భవనాన్ని వ్యతిరేకించారని శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు.
కాంగ్రెస్ నేతలు 1978 నుంచి
2009 దాకా
తెలంగాణకు ఒక కొత్త మెడికల్ కాలేజీని ఎందుకు తేలేకపోయారని ప్రశ్నించారు. తెలంగాణ
వచ్చాక ఐదు మెడికల్ కాలేజీలు తెచ్చామని తెలిపారు. ఉస్మానియాలో ఖాళీ జాగాలో నాలుగు
అంతస్థులకు మించి భవనం కట్టడానికి లేదని విమర్శలు చేస్తున్న అజ్ఞానులకు తెలియదా
అని విమర్శించారు.
కరోనా కంటే కాంగ్రెస్సే
ప్రమాదకారి అని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ప్రతిపక్షాలు సృష్టించే భయాందోళనలతో
బతుకుతారనుకుంటున్న కరోనా రోగులు కూడా చనిపోతున్నారని ఆరోపించారు. ఉస్మానియాకు
కొత్త కట్టడాన్ని ఇపుడున్న స్థలంలో కడితే అడ్డుకోబోమని ప్రతిపక్షాలు హామీ ఇస్తే ఒక్క
ఏడాదిలోనే అద్భుత భవనాన్ని కట్టి చూపిస్తామని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.