Advertisement

  • స్టోక్స్ ఇక ధోనీని ఎదుర్కోకూడదని నేను ప్రార్థిస్తున్నా ..శ్రీశాంత్

స్టోక్స్ ఇక ధోనీని ఎదుర్కోకూడదని నేను ప్రార్థిస్తున్నా ..శ్రీశాంత్

By: Sankar Tue, 09 June 2020 11:44 AM

స్టోక్స్ ఇక ధోనీని ఎదుర్కోకూడదని నేను ప్రార్థిస్తున్నా ..శ్రీశాంత్


టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై నోరుజారిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌కి వివాదాస్పద ఫాస్ట్ బౌలర్ ఎస్. శ్రీశాంత్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో.. భారత్ జట్టుని గెలిపించాలనే తపనతో ధోనీ ఆడలేదని బెన్‌స్టోక్స్ ఆరోపించాడు. 338 పరుగుల ఛేదనలో టీమిండియా విజయానికి చివరి 11 ఓవర్లలో 112 పరుగులు అవసరమైన దశలో ధోనీ క్రీజులోకి వచ్చాడని గుర్తుచేసిన బెన్‌స్టోక్స్.. సిక్సర్లు, ఫోర్లు హిట్ చేయకుండా కేవలం సింగిల్స్‌తో సరిపెట్టాడని ఎద్దేవా చేశాడు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 31 పరుగుల తేడాతో గెలిచింది.

sreeshanth,ben stokes,ms dhoni,india,england ,స్టోక్స్,  ధోనీ, శ్రీశాంత్,  ఇంగ్లాండ్, భారత్


వరల్డ్‌కప్‌లో ధోనీ అంకితభావాన్ని బెన్‌స్టోక్స్ ప్రశ్నించడంపై శ్రీశాంత్ మండిపడ్డాడు. ‘‘బెన్‌స్టోక్స్ ఇకపై ఏ మ్యాచ్‌లోనూ ధోనీని ఎదుర్కోకూడదని నేను ప్రార్థిస్తున్నా. ఎందుకంటే.. ఇలాంటి వెటకారపు మాటల్ని ధోనీ అంత సులువుగా విడిచిపెట్టడు. బహుశా గత 4-5 ఏళ్ల నుంచి బెన్‌స్టోక్స్ క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. నేను కొన్నేళ్ల నుంచి క్రికెట్ ఆడటం లేదు. అయినప్పటికీ స్టోక్స్‌కి నేను బౌలింగ్ చేసేందుకు రెడీ. ఈ పోటీ.. ధోనీపై అతను చేసిన వ్యాఖ్యలకి సమాధానం చెప్పేందుకు మాత్రమే. భవిష్యత్‌లో కచ్చితంగా ధోనీ నుంచి బెన్‌స్టోక్స్‌కి శిక్ష తప్పదు. అతను ఇప్పుడు బెస్ట్ ఆల్‌రౌండర్ కావొచ్చు. కానీ.. ధోనీని ఔట్‌ చేసే సామర్థ్యం అతనికి లేదు’’ అని శ్రీశాంత్ వెల్లడించాడు.
వాస్తవానికి ఆ మ్యాచ్‌లో భారత్ గెలిచింటే.. పాకిస్థాన్ సెమీస్ రేసులో నిలిచేది. కానీ.. టీమిండియా ఓడిపోవడంతో పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాక్‌ని రేస్‌ నుంచి తప్పించడానికే భారత్ జట్టు ఆ మ్యాచ్‌లో ఉద్దేశపూర్వకంగా ఓడిపోయిందని ఇప్పటికీ పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆ వన్డే ప్రపంచకప్ తర్వాత ధోనీ మళ్లీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

Tags :
|

Advertisement