మరింత కోలుకున్న దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలు .. ప్రార్థన కొనసాగించాలి అని చరణ్ అభ్యర్ధన
By: Sankar Fri, 28 Aug 2020 9:55 PM
తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిన్నటి కంటే నేడు మరింత కోలుకున్నారని ఎస్పీ చరణ్ తెలిపారు. శుక్రవారం ఆయన బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఫేస్బుక్లో ఒక వీడియో షేర్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నాన్న ఆరోగ్యం రోజు రోజుకూ మెరుగవుతోంది. నిన్నటితో పోలిస్తే.. ఇంకాస్త కోలుకున్నారు. ఊపిరితిత్తుల్లో మెరుగుదల ఉంది. వైద్యులు చాలా నమ్మకంగా ఉన్నారు. నాన్నగారు కోలుకోవాలని ప్రార్థన కొనసాగించాలి’ అని చరణ్ అభ్యర్థించాడు.
బాలుకు ఆగస్టు 5న కరోనా సోకగా ఆయన్ను చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చేర్చి వైద్యం అందజేస్తున్నారు. ఆగస్టు 14న ఆయన ఆరోగ్యం క్షీణించగా ఐసీయూకు తరలించి మెరుగైన వైద్యం అందజేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఐసీయూలో, ఎక్మో సాయంతో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. వైద్యులు అడిగిన దానికి స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఫిజియోథెరపీ చేస్తున్నాం. ప్రత్యేక వైద్య నిపుణులు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎల్లప్పుడూ పరిశీలిస్తున్నారని’ శుక్రవారం తెలిపారు.