Advertisement

  • నిలకడగా ఎస్పీ బాలు ఆరోగ్యం ..వెల్లడించిన ఎస్పీ చరణ్

నిలకడగా ఎస్పీ బాలు ఆరోగ్యం ..వెల్లడించిన ఎస్పీ చరణ్

By: Sankar Sun, 16 Aug 2020 08:09 AM

నిలకడగా ఎస్పీ బాలు ఆరోగ్యం ..వెల్లడించిన ఎస్పీ చరణ్


ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం పరిస్థితి మెరుగుకావడంతో చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగాఉందని, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వైద్య బృందం తెలిపింది.

శుక్రవారం నాడు ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం అందించారు. అయితే ఆయన పరిస్థితి క్రిటికల్‌గా ఉండటంతో అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగు కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కాగా.. కరోనా లక్షణాలతో ఈ నెల 5వ తేదీన ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం హాస్పటల్‌లో చేరారు.. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై వదంతులు రావడంతో.. తాను ఆరోగ్యంగా ఉన్నానని ఆందోళన పడాల్సిన అవసరం లేదని.. త్వరలోనే కోలుకుంటానని వీడియో ద్వారా అభిమానులకు క్షేమ సమాచారాన్ని అందించారు బాలు.

అయితే గురువారం రాత్రి ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం నిపుణులైన డాక్టర్లు ఆయనని పర్యవేక్షిస్తున్నారని, ఐసీయూలో వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లుగా శనివారం విడుదల చేసిన బులెటిన్‌లో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు బాలు ఆరోగ్యంపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ స్పందించారు. ఎస్పీ బాలు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వదంతులను నమ్మొద్దని కోరారు. ఒకట్రెండు రోజుల్లో నాన్నగారు కోలుకుంటారు.. వైద్యులు తెలిపినట్టు ప్రకటించారు చరణ్‌. మరోవైపు ఎస్పీ బాలు భార్య సావిత్రికి శుక్రవారం కరోనా పరీక్షలు నిర్వహించగా ఆమెకు కూడా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఆమెను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ఇద్దరి పరిస్థితి బాగానే ఉందని తెలిపారు చరణ్.

Tags :
|
|
|

Advertisement