ఎస్పీ బాలుస్పృహలోకి వచ్చారు - డాక్టర్ అనురాధా భాస్కర్
By: Dimple Thu, 27 Aug 2020 00:24 AM
కరోనాను జయించిన ఎస్పీబాలసుబ్రహ్మణ్యం స్పృహలోకి వచ్చారు. డాక్టర్ల శ్రమ ఫలించింది. అభిమానుల ప్రార్థనలు విజయవంతమయ్యాయి. వెంటిలేటర్, ఎక్మోల సాయంతోనే ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని ఎంజిఎం ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అనురాధా భాస్కర్ తెలిపారు. బాలు ఆరోగ్యపరిస్థితిని వైద్య బృందం సునిశితంగా పరీక్షిస్తోందని పేర్కొన్నారు.
కరోనాతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు చరణ్ బుధవారం వెల్లడించారు. ఆయనకు డాక్టర్లు ఎక్మోతో వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. "నాన్నను చూసేందుకు నేను ఆస్పత్రికి వెళ్లాను. నిన్నటికంటే నేడు ఎక్కువ సేపు మెళకువగా ఉన్నారు. నాతో ఏదో చెప్పడానికి రాసేందుకు ప్రయత్నించారు. కానీ పెన్ను కూడా సరిగా పట్టుకునే శక్తి లేకపోవడంతో అది కుదరలేదు. అయితే త్వరలోనే రాయగలిగి నాతో మాట్లాతారన్న నమ్మకం ఉంది."
"నాన్న పాటలు వింటున్నారు. పాడేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఆయన కోలుకుంటున్నారనేందుకు ఇదే నిదర్శనం. ఇది నేటి అప్డేట్. అందరికి కృతజ్ఞతలు" అని చెప్పుకొచ్చారు. కాగా కరోనా సోకడంతో ఎస్పీ బాలు ఈ నెల 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. తొలుత ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ మధ్యలో కాస్త విషమించింది.
ఈ క్రమంలో ఆయన మరణించాడంటూ పుకార్లు వ్యాపించగా వాటిని ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్ కొట్టిపారేశారు. రెండు మూడు రోజులుగా ఆయన ఆరోగ్యం కుదుటపడుతుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.