Advertisement

కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

By: chandrasekar Tue, 02 June 2020 2:01 PM

కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు


వాతావరణ శాఖ చల్లని కబురు అందించింంది. నైరుతి రుతుపవనాలు సోమవారం దేశంలోకి ప్రవేశించినట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాలు కేరళలో తీరాన్ని తాకాయని, మరో 12 గంటల్లో ఆరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. ఇది బలపడి తుఫానుగా మారుతుందని పేర్కొంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రాంతాల వారీగా ఈ ఏడాది వర్షపాతం అంచనాలను వెల్లడించనుంది.

దేశంలో నైరుతి రుతుపవనాల ప్రవేశంతో ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. భారత్‌లో వ్యవసాయానికి నైరుతి రుతుపవనాలే కీలకం. దాదాపు 80 శాతం భూభాగం దీనిపైనే ఆధారపడింది. దేశంలోకి ఈ ఏడాది రుతుపవనాలు కొంత ఆలస్యంగా ప్రవేశించనున్నాయని మే 15న భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా జూన్ 1 నాటికి కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకనుండగా ఈ ఏడాది మాత్రం జూన్ 5కి నాలుగు రోజుల ముందు లేదా వెనుక తాకుతాయని పేర్కొంది. అయితే, ఇప్పుడు అనుకున్న సమయానికే నైరుతి వచ్చింది.

southwest,monsoon,enters,kerala,rains ,కేరళలోకి, ప్రవేశించిన, నైరుతి, రుతుపవనాలు, వాతావరణ


దేశంలో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తొలుత తాకి తర్వాత దేశమంతటా విస్తరిస్తాయి. కేరళ నుంచి కర్ణాటక మీదుగా ఏపీ, తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. సాధారణంగా మే 22 నాటికి అండమాన్ దీవులలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. మరోవైపు, తూర్పు మధ్య అరేబియా స‌ముద్రంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం ఉదయం వాయుగుండంగా మారిందని, ఇది నేటి సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా, మరో 24 గంటల్లో తుఫాన్‌గా మారుతుందని భారత వాతావరణ కేంద్రం ఐఎండీ వెల్లడించిన బులిటెన్‌లో తెలిపింది.

జూన్ 3న ఉదయం తీవ్ర తుఫాన్‌గా మారి మహారాష్ట్ర, గుజరాత్ వద్ద అదే రోజు రాత్రి తీరాన్ని తాకనుందని వెల్లడించింది. ప్రస్తుతం ఈ వాయుగుండం గోవాలోని పనాజీకి నైరుతిగా 370 కిలోమీటర్లు, మహారాష్ట్రలోని ముంబయికి దక్షిణ-నైరుతిగా 690 కిలోమీటర్లు, గుజరాత్‌లోని సూరత్‌కు నైరుతిగా 920 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు పేర్కొంది.

Tags :
|
|

Advertisement