తల్లితండ్రిని కోల్పోయిన ముగ్గురు పిల్లల బాధ్యత తీసుకున్న సోను సూద్
By: Sankar Sat, 01 Aug 2020 11:21 AM
ఆపదలో ఉన్నవారికి నేనున్నా అంటూ పెద్దన్నగా అండగా నిలుస్తున్నారు ప్రముఖ సినీ నటుడు సోనూసూద్. కరోనా విజృంభిస్తోన్న నాటి నుంచి నేటి వరకు సోనూసూద్ తన గొప్ప మనసుతో ఎంతోమందికి భరోసానిస్తున్నారు. తాజాగా తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు పిల్లలకు తాను అండగా ఉంటానన్నారు సోనూసూద్. యాదాద్రి భునవగిరి జిల్లా ఆత్మకూరు మండలకేంద్రంలో సత్యనారాయణ, అనురాధకు ముగ్గురు సంతానం.
సత్యనారాయణ ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి అనురాధ కూలిపనులు చేసుకుంటూ ముగ్గురు పిల్లలను పోషిస్తోంది. వారం రోజుల క్రితం తల్లి అనురాధ అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో పెద్ద కుమారుడు మనోహర్ తన చెల్లి, తమ్ముడి ఆలనా పాలనా చూసుకుంటున్నాడు.
అయితే హృదయవిదారకమైన చిన్నారుల దీనస్థితిని రాజేశం కరణం అనే వ్యక్తి ట్విట్టర్ ద్వారా సోనూసూద్ దృష్టికి తీసుకొచ్చాడు. దీనిపై స్పందించిన సోనూసూద్..ముగ్గురు పిల్లలు అనాథలు కాదని, ఇకపై తాను వారికి అండగా ఉంటానని, ముగ్గురి పిల్లల బాధ్యత తీసుకుంటానని హామీనిచ్చి గొప్ప మనసు చాటుకున్నారు. సోనూసూద్ ఆలోచన ఎంతోమందిని కదిలిస్తోంది.