అసమ్మతి నేతలతో భేటీ అయిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ...
By: Sankar Sun, 20 Dec 2020 12:08 PM
కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పార్టీ నాయకులతో శనివారం తన నివాసంలో భేటీ అయ్యారు. పార్టీలో సమూల మార్పులు జరగాలని ఆగస్టులో లేఖ రాసి, అసమ్మతిని బహిర్గతం చేసిన జీ–23లోని కీలక నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించారు.
పార్టీలోని అంతర్గత సమస్యలను పరిష్కరించాలని, ఆగస్టులో సోనియాకు రాసిన లేఖలో అసమ్మతివాదులు అంచనా వేసినట్లు రాష్ట్ర, స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్కు తీవ్రమైన నష్టం జరిగిన నేపథ్యంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ చేసిన విజ్ఞప్తి మేరకు సోనియాగాంధీ శనివారం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. అయితే ఎప్పటినుంచో చర్చల్లో ఉన్న పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించిన చర్చ ఏదీ జరగలేదని పార్టీ వర్గాలు తెలిపాయి..