చికిత్స తర్వాత అమెరికానుంచి స్వదేశానికి తిరిగొచ్చిన సోనియా , రాహుల్
By: Sankar Tue, 22 Sept 2020 5:44 PM
సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ మంగళవారం ఉదయం స్వదేశానికి తిరిగి వచ్చారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సోనియా గాంధీ ఆరోగ్య పరీక్షల కోసం ఈ నెల 12న రాహుల్తో కలిసి అమెరికా వెళ్లారు. గతంలో కూడా ఆమె అమెరికా వెళ్లి చికిత్స పొందారు.
అయితే కరోనా నేపథ్యంలో ఈసారి వైద్య పరీక్షల కోసం యూఎస్ వెళ్లేందుకు కాస్త ఆలస్యమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 14 నుంచి ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సోనియా, రాహుల్ దూరంగా ఉన్నారు. అయితే వ్యవసాయ బిల్లుల ఆమోదంపై కాంగ్రెస్తోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు తీవ్రం చేస్తున్నాయి.
ఈ నెల 24 నుంచి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అగ్రి బిల్లులకు వ్యతిరేకంగా రెండు కోట్ల మంది రైతుల నుంచి సంతకాలు సేకరించే కార్యక్రమం ప్రారంభించనున్నది. అలాగే బిల్లులను ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకూడదని కాంగ్రెస్ భావిస్తున్నది.