గుంటూరు లో కలకలం రేపుతున్న వింతవ్యాధి
By: Sankar Sun, 13 Dec 2020 9:37 PM
ఏలూరు లో వింత వ్యాధితో వందల మంది ప్రజలు అస్వస్థతకు గురి అయిన సంగతి దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే..తాజాగా, గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలోనూ కొందరు అస్వస్థతకు గురవుతుండటం కలకలం రేగుతోంది.
ఒకరి తర్వాత ఒకరుగా పలువురు స్పృహ తప్పి పడిపోతుండటంతో వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. నడికుడికి చెందిన పల్లపు రామకృష్ణ అనే యువకుడు స్పృహ తప్పి పడిపోవడంతో గుర్తించిన కుటుంబ సభ్యులు ఆయనను స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అనంతరం గుంటూరు వైద్యశాలకు తరలించారు.
అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు కూడా స్పృహ తప్పి పడిపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాల కారణంగానే ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని గ్రామస్థులు అంటున్నారు..