సాఫ్ట్ వేర్ కంపెనీలు పునః ప్రారంభం
By: chandrasekar Sat, 23 May 2020 5:44 PM
కరోనా మహమ్మారిని కట్టడి
చేసేందుకు ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో అనేక ఐటీ పరిశ్రమలు వర్క్ ఫ్రం హోంకు
శ్రీకారం చుట్టాయి. ఇటీవల సడలింపు ఇవ్వడంతో 30శాతం ఐటీ పరిశ్రమలు తెరుచుకున్నాయి. ప్రభుత్వ
నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తూ కార్యకలాపాలు నిర్వహిస్తూనే ఉద్యోగులకు పలు షరతులు
విధించారు. అయితే ప్రతి ఉద్యోగిని పరీక్షించాకే పనిలోకి తీసుకుంటున్నారు.
గర్భిణులు, చిన్న పిల్లలున్న తల్లిదండ్రులకు వర్క్ ఫ్రం హోం అమలు
చేశారు. ఏది ఏమైనప్పటికీ ఉద్యోగుల ఆరోగ్యానికి కంపెనీలు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూనే
అనేక చాలెంజ్లను ఎదుర్కొనవలసి ఉంటుందని పలువురు ఐటీ నిపుణులు పేర్కొంటున్నారు.
ఐటీ కంపెనీలు ఉద్యోగుల
ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో వైద్యుల సూచనలు అమలు చేస్తున్నాయి.
33 శాతం
వర్క్ఫోర్స్తో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం అనుమతించిన విషయం
తెలిసిందే. అయితే మరికొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోంకే ప్రాధాన్యతనిస్తూ సెప్టెంబర్
వరకు పొడిగించాయి. సుమారు 30శాతం కంపెనీలు మాత్రమే తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.
అనవసరంగా భయాందోళనలు చెందకుండా ఐటీ కంపెనీలకు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసిడ్యూర్(ఎస్ఓపీ)ను
ఇండస్ట్రీబాడీలు, పోలీసులు జారీ చేశారు. ఉద్యోగుల పికప్ అండ్
డ్రాపింగ్ మొదలుకుని టెంపరేచర్ టెస్ట్ల వరకు జాగ్రత్తలను సూచించారు. అనవసర
వదంతులను నమ్మి అలజడి చెందవద్దని, నోడల్ అధికారి అనుమతి లేకుండా కరోనాకు సంబంధించి
కంపెనీలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదని అందులో సూచించారు.
ఐటీ కంపెనీలు గత వారం
నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి ప్రమాదం
పొంచి ఉండటంతో ఆరోగ్య జాగ్రత్తలు అవసరమని ఐటీ అసోసియేషన్స్ భావించాయి. ఎవరికైన
కరోనా సోకితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఉద్యోగుల సంరక్షణకు కంపెనీలు ఏం చేయాలి? తదితర
విషయాలన్నింటిపై ప్రభుత్వ సూచనలతో కంపెనీలకు మార్గదర్శకాలను రిలీజ్ చేశారు. గతంలో
రహేజా పార్కులో ఓ ఉద్యోగికి కరోనా వచ్చిందని చాలా మంది ఆందోళనకు గురయ్యారు. కానీ
చివరికి ఆ ఉద్యోగి రిపోర్టులో నెగెటివ్ అని తేలింది. అలాంటి సంఘటనలను దృష్టిలో
పెట్టుకుని అనవసరంగా పానిక్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఐటీ కంపెనీలు నిబంధనలు పాటించేలా
తప్పనిసరి చేశారు.
గతంలో మాదిరిగా కాకుండా
కొన్ని షరతులతో ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుంది. ఐటీ ఎంప్లాయీస్లో ఎవరికైనా కరోనా
లక్షణాలు ఉన్నట్టుగా భావిస్తే సదరు వ్యక్తిని కార్యాలయాల్లోని ఐసోలేషన్లో ఉంచాలి.
పీపీఈ కిట్స్ ధరించమని చెప్పాలి. వెంటనే వైద్యులకు సమాచారం ఇవ్వాలి. 14
రోజులు హోం క్వారంటైన్లో ఉండేలా చర్యలు
తీసుకోవాలి. నెగెటివ్ అని తేలితే వైద్యుడు జారీ చేసే సర్టిఫికెట్తో
కార్యాలయానికి అనుమతించాలి. పాజిటివ్ అని తేలితే వైద్యుల సూచనల మేరకు చికిత్స
తీసుకోవాలి. అతడు కార్యాలయంలో ఎంతమందితో కలిశాడు? అనేదిగుర్తించి వారిని
క్వారంటైన్కు తరలించాలి. ఆ ఉద్యోగి వినియోగించిన క్యాబిన్, సిస్టమ్
తదితర వాటిని శానిటైజ్ చేసిన అనంతరం రెండు రోజుల తర్వాత ఆ పరిసరాలను
వినియోగించాలి. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టేవరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం
అవకాశం ఇస్తేనే మంచిది. ఉద్యోగుల ఆరోగ్యం చాలా ముఖ్యం. ఐటీ కంపెనీల్లో జాగ్రత్తలను
తప్పనిసరి చేస్తూ ఇచ్చిన నిబంధనలు సక్రమంగా అమలుచేస్తే అందరికీ మంచిది. కంపెనీలు
పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించగలిగితే అనేక చాలెంజ్లను ఎదుర్కోవాల్సి
వస్తుంది. కార్యాలయంలోనైనా లేదా ఇంటి నుంచైనా ఫలితం మాత్రం ఒకే విధంగా ఉంటుంది.