బోరబండలో భూప్రకంపనలు ..భయంతో పరుగులు తీసిన ప్రజలు
By: Sankar Sun, 04 Oct 2020 7:58 PM
హైదరాబాద్ నగరంలోని బోరబండలో మళ్లీ భూప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి భారీ శబ్ధాలు వస్తుండంతో జనం భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. భారీ శబ్ధాలతో 4 సెకన్ల పాటు భూమి కంపించింది.
రెండు రోజుల క్రితం కంటే భారీ శబ్ధాలు వచ్చాయని స్థానికులు చెప్తున్నారు. కాగా, భూప్రకంపనలపై ఎన్జీఆర్ఐ సీనియర్ సైంటిస్ట్ శ్రీనగేష్ స్పందించారు. భూమి పొరల్లో నీరు చేరుతున్న సమయంలో శబ్ధాలు వస్తాయని అంటున్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న తప్పుడు వార్తల్ని నమ్మొద్దని అన్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వెల్లటూరులో 1600 సార్లు భూమి కంపించిందని తెలిపారు. ఇవాళ ఒక్కరోజే 12సార్లు భూకంపం వచ్చినట్టు రికార్డ్ నమోదైందని శ్రీనగేష్ వెల్లడించారు. రహమత్నగర్, బోరబండ ప్రాంతాల్లో వచ్చిన భూ ప్రకంపనలు సహజమైనవేని ఆయన స్పష్టం చేశారు. ఆస్తి, ప్రాణనష్టాలు జరిగే అవకాశమే లేదని అన్నారు.