కోహ్లీని స్లెడ్జింగ్ చేస్తే ఆక్సీజెన్ అందించినట్లే ...డీన్ జోన్స్
By: Sankar Wed, 03 June 2020 8:28 PM
ఇప్పటికే పలు క్రికెట్ జట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్లెడ్జ్ చేయడాన్ని దాదాపు నిలిపేశాయనే చెప్పాలి. ప్రధానంగా ఆస్ట్రేలియా జట్టు కోహ్లిని స్లెడ్జ్ చేసే సాహసం చేయడం లేదు. కోహ్లిని రెచ్చగొడితే దానికి పర్యావసనం తీవ్రంగా ఉంటుందనే దానికి దూరంగా ఉంటుంది ఆసీస్. సాధారణంగా ప్రతీ ప్లేయర్ని మాటలతో రెచ్చగొట్టే ఆసీస్.. కోహ్లి విషయంలో మాత్రం కాస్త ఆచితూచి వ్యహరిస్తోంది. కోహ్లిని స్లెడ్జ్ చేసి మూల్యం చెల్లించుకోవద్దని ఇప్పటికే పలువురు విశ్లేషకులు అభిప్రాయపడగా, ఆసీస్ దిగ్గజ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత డీన్ జోన్స్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేశాడు.
ఒకవేళ కోహ్లిని స్లెడ్జ్ చేస్తే అది అతనికి అది ఆక్సిజన్లా పనిచేస్తుందన్నాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ కోహ్లిని స్లెడ్జింగ్ చేసి రెచ్చగొట్టడానికి ప్రయత్నించవద్దన్నాడు. ఎలుగుబంటిని రెచ్చగొడితే ఎటువంటి పర్యావసానాలు ఉంటాయో, కోహ్లిని రెచ్చగొట్టినా కూడా అదే విధంగా ఉంటుందన్నాడు. ఈ సీజన్ చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ వెళ్లనున్న నేపథ్యంలో డీన్ జోన్స్ ముందుగా ఆ జట్టు క్రికెటర్లను హెచ్చరించాడు.
ఈ క్రమంలోనే కోహ్లిని ఆసీస్ క్రికెటర్లు రెచ్చగొట్టకపోవడానికి ఐపీఎల్లో ఆడటమే కారణమన్న ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ వ్యాఖ్యలను జోన్స్ ఖండించాడు. క్లార్క్ వ్యాఖ్యల్లో ఎటువంటి వాస్తవం లేదన్నాడు. ఏ క్రికెటర్నైనా ఐపీఎల్ ఆడకుండా కోహ్లి చేస్తాడనడం సమంజసం కాదన్నాడు. అది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించాడు. ఆ తరహా వ్యాఖ్యలు క్లార్క్ ఎందుకు చేశాడో తనకు అర్థం కావడం లేదన్నాడు. గత పర్యటనలో ఆసీస్ జట్టు ప్రణాళికలో భాగంగానే కోహ్లిని స్లెడ్డింగ్ చేయలేదన్నాడు. ఇక ముందైనా ఇలా చేయడమే ఆసీస్ జట్టుకు శ్రేయస్కరమన్నాడు. ప్రధానంగా భారత క్రికెట్ జట్టులో కోహ్లి, ధోనిలను రెచ్చగొట్టకుండా ఉండటమే ఉత్తమం అని జోన్స్ అభిప్రాయపడ్డాడు.