ఆర్థిక వ్యవస్థలో పునరుజ్జీవనం కనిపించే సంకేతాలు...కేంద్ర ఆర్థిక మంత్రి
By: chandrasekar Wed, 28 Oct 2020 11:11 AM
కరోనా వైరస్ మహమ్మారి
కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి
ప్రతికూలంగాగానీ లేదా సున్నాకి దగ్గరగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా
సీతారామన్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-జూన్) మొదటి త్రైమాసికంలో
ఆర్థిక వ్యవస్థలో 23.9 శాతం భారీ సంకోచం ఉండటమే దీనికి ప్రధాన కారణమన్నారు.
మహమ్మారి కారణంగా పూర్తి లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత అన్ని రంగాలు
కోలుకుంటున్నాయని తెలిపారు. మంగళవారం జరిగిన సెరావీక్ 4 వ
వార్షిక ఇండియా ఎనర్జీ ఫోరంలో ఆర్థిక మంత్రి ప్రసంగించారు. గ్రామీణ రంగం బాగా
పనిచేస్తున్నదని, ఆటో అమ్మకాలు మంచి వృద్ధిని సాధించాయని తెలిపారు.
భారతదేశంలో ఫెస్టివల్
సీజన్ ప్రారంభమైనందున డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నానని చెప్పారు. మూడు, నాలుగో
త్రైమాసికంలో మరింత సానుకూల వృద్ధి సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. విదేశీ
ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) ప్రవాహం 2019 ఏప్రిల్-ఆగస్టుతో పోల్చితే 2020
ఏప్రిల్-ఆగస్టులో కరోనా ఉన్నప్పటికీ 13 శాతం వృద్ధిని సాధించిందని ఆమె పేర్కొన్నారు. ఆర్థిక
కార్యకలాపాలను పెంచడానికి ప్రభుత్వ వ్యయంపై ప్రభుత్వం దృష్టి సారించిందని
సీతారామన్ తెలిపారు. దేశం యొక్క ఇంధన అవసరాల గురించి మాట్లాడిన సీతారామన్..
సమర్థమైన గ్యాసిఫికేషన్ భారత ఆర్థిక వ్యవస్థను నడిపిస్తుందని అన్నారు. జీవ ఇంధనాల
సమర్థ వినియోగాన్ని దేశం చూస్తున్నదని, అణుశక్తి కోసం ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం
చేసుకోవడానికి భారతదేశం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. సోమవారం నాడు సెరావీక్ ఫోరంలో
ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం చేశారు.