Advertisement

  • ప్రధాని మోడీతో సరితూగే నాయకుడు కాంగ్రెస్ పార్టీలో లేడు..శివసేన ఎంపీ సంచలన వ్యాఖ్యలు

ప్రధాని మోడీతో సరితూగే నాయకుడు కాంగ్రెస్ పార్టీలో లేడు..శివసేన ఎంపీ సంచలన వ్యాఖ్యలు

By: Sankar Mon, 31 Aug 2020 07:01 AM

ప్రధాని మోడీతో సరితూగే నాయకుడు కాంగ్రెస్ పార్టీలో లేడు..శివసేన ఎంపీ సంచలన వ్యాఖ్యలు


కాంగ్రెస్‌ పార్టీలో ప్రస్తుతం నాయకత్వంపై సాగుతున్న చర్చలో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ జోక్యం చేసుకున్నారు. పార్టీ నాయకత్వాన్ని చేపట్టకుండా రాహుల్‌ గాంధీని నిలువరిస్తే కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగవుతుందని ఆయన హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సరితూగే స్ధాయి కలిగిన నేత కాంగ్రెస్‌లో లేరని రౌత్‌ శివసేన పత్రిక సామ్నాలో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ తాత్కాలిక చీఫ్‌ సోనియా గాంధీకి 23 మంది ఆ పార్టీ సీనియర్‌ నేతలు లేఖ రాయడం పట్ల శివసేన ఎంపీ విస్మయం వ్యక్తం చేశారు. సీనియర్‌ నేతలు పార్టీలో క్రియాశీలకంగా ఉండకుండా నిరోధించిన వారు ఎవరని ప్రశ్నించారు. రాహుల్‌కు నాయకత్వ పగ్గాలు అప్పగించకుండా అడ్డుకుంటే అది పార్టీ వినాశనానికి దారితీస్తుందని రౌత్‌ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా గాంధీయేతరుడి ఎన్నిక మంచి ఉద్దేశమే అయినా ఆ 23 మందిలో అలాంటి సామర్థ్యం ఉన్న నేత ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నడూ చావులేని వృద్ధ మహిళ వంటిదని ఆ పార్టీ దివంగత నేత వీఎన్‌ గాడ్గిల్‌ అభివర్ణించేవారని, అలాంటి పార్టీని ఎలా కాపాడుకోవాలో రాహుల్‌ నిర్ణయించుకోవాలని రౌత్‌ అన్నారు.కాగా, మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలో శివసేన ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే.

Tags :
|

Advertisement