ప్రభుత్వ రవాణా ఉద్యోగులలో తను ఒక్కరే మహిళా డ్రైవర్
By: chandrasekar Fri, 11 Sept 2020 12:06 PM
సిమ్లాలో ఎగుడుదిగుడుగా
ఉండే ఆ కొండ ప్రాంతంలో నడక సాగడమే కష్టం. అలాంటిది ఏకంగా బస్సే నడుపుతుంది
సీమాఠాకూర్.
కరోనా సమయంలోనూ డ్యూటీ చేస్తూ, ప్రభుత్వసేవలో
ముందుంటున్నది. ఇంతకీ సీమాఠాకూర్ ప్రత్యేకత ఏమిటంటే హిమాచల్ ప్రదేశ్లో ఉన్న
ఎనిమిదివేల మందికి పైగా ప్రభుత్వ రవాణా ఉద్యోగులలో తను ఒక్కరే మహిళా డ్రైవర్.
పనిలో చేరి నాలుగేళ్లయినా, ఇంకా ఆ
రికార్డు చెక్కు చెదరలేదు. ‘ఓ బస్ డ్రైవర్గా ప్రజలకు సేవ చేయడం చాలా సంతోషంగా
ఉంది. ఈ కరోనా కాలంలో డ్యూటీ పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లడం కాస్త భయం కలిగించే
విషయమే.
ఎప్పటికప్పుడు జాగ్రత్తలు
తీసుకోవడం తప్ప చేసేదేమీ లేదు’ అంటారామె. ఆడవాళ్లు ప్రవేశించడం కష్టం అనుకునే చోట
అడుగుపెట్టడమే కాకుండా, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నిబ్బరంగా డ్యూటీ
చేస్తున్న సీమాఠాకూర్కు అక్కడి ప్రజలు అభినందనలు చెబుతున్నారు.