ఆయన హుస్సేన్ సాగర్ హీరో....114 మంది ప్రాణాలను కాపాడారు
By: Anji Wed, 16 Sept 2020 7:12 PM
హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ తీరం. టాంక్ బండ్కి అవతలి వైపు. తుప్పల మధ్య నుంచి నాంపల్లి సికింద్రాబాద్ స్టేషన్లను కలిపే రైల్వే ట్రాక్. ఆ ట్రాక్ మీద కూర్చున్నాడు ఓ కుర్రాడు. వయసు పది, పదకొండేళ్లు ఉండొచ్చేమో! సరిగ్గా తెలీదు. ఆ మాటకు వస్తే, ఆ కుర్రాడికే తన వయసు తనకే స్పష్టంగా తెలీదు.
మత్తుమందు బానిసలు, చెత్త ఏరుకునే వారు, ఇలా రకరకాల వారికి ఆ రైల్వే ట్రాక్ ఆవాసం. పని దొరికినప్పుడు చేయడం, దొరకనప్పుడు వెళ్లి ఆ ట్రాక్ మీద కూర్చోవడం.. ఇదీ ఆ కుర్రాడి దినచర్య. తానుండే అనాథాశ్రమంలో తన తోటి వారికి పని దొరికింది. చెత్త ఏరి, చెత్త బండి తోలే పని. తనకూ వచ్చింది ఆ పని. కానీ నచ్చలేదు. అందుకే వేరే పనులు చేస్తూ, పని లేనప్పుడు ట్రాక్ దగ్గర కూర్చుంటాడు.
ఓ రోజు ఎప్పట్లాగే ట్రాక్ దగ్గర ఒంటరిగా కూర్చున్నాడు. దూరంగా కొందరు గుంపుగా ఉన్నారు. వాళ్లెప్పుడూ అక్కడే ఉంటారు. అప్పుడే అక్కడకి సైఫాబాద్ స్టేషన్ నుంచి కొందరు పోలీసులు వచ్చారు. అక్కడున్న వారితో మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరితో విడివిడిగానూ, అందరితో కలిపి కూడా మాట్లాడుతున్నారు. పోలీసులు అడిగిన దానికి అక్కడి వారు ఒప్పుకోవడం లేదు.
ఇదంతా గమనిస్తున్న ఆ కుర్రాడు నేరుగా పోలీసుల దగ్గరకు వెళ్లాడు. వాళ్లు చెప్పింది విన్నాడు. ఆ పని చేసేందుకు తాను సిద్ధమని పోలీసులతో చెప్పాడు. ఈ కుర్రాణ్ణి ఎగాదిగా చూసిన పోలీసులు వద్దన్నారు. ‘నువ్వు పిల్లాడివి. కుదరద’న్నారు. ‘కాదు, నేను చేయగలను’.. జవాబిచ్చాడు ఆ కుర్రాడు. పోలీసులకు మనసు ఒప్పుకోవడం లేదు. కానీ, వాళ్ల ముందు వేరే దారి కూడా లేదు.
దీంతో ఆ కుర్రాడిని తమతో తీసుకువెళ్లారు. పోలీసులు చెప్పింది ఆ కుర్రాడు చేశాడు. అందుకు వాళ్లు ముప్పయో, నలభయో అతడి చేతిలో పెట్టారు. అప్పట్లో అది తనకు చాలా పెద్ద సంపాదన. ఆ కుర్రాడి పేరు శివ. అతడు చేసిన పని ఏంటంటే, హుస్సేన్ సాగర్లో నీటిలో బాగా నాని, కుళ్లిపోతున్న ఒక మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకు రావడం.
ఈ ఘటన జరిగి, రెండు దశాబ్దాలు గడిచింది. శివ ఇంకా అదే పని చేస్తున్నారు. అయితే, మృతదేహాలను వెలికి తీయడమే కాదు, మృత్యువు అంచుల్లో నుంచి ఎందరినో లాక్కువచ్చి, బతికిస్తున్నారు. సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఎందరినో ప్రాణాలు పణంగా పెట్టి శివ కాపాడారు.
ఆయన వెలికితీసిన శవాల లెక్కలేదు కానీ, కాపాడిన ప్రాణాల లెక్కైతే ఆయన వేసుకున్నారు. పది, ఇరవై కాదు... అక్షరాల 114 మంది ప్రాణాలను ఆయన కాపాడారు. వీరిలో కొందరిని దూకుతుండగానే ఆపారు. ఇంకొందరిని దూకాక, వెలికితీసి కాపాడారు. శివ నివాసం ట్యాంక్బండ్లోనే. హుస్సేన్ సాగర్ నుంచి అనాథ శవాలు తీయడం, ఆత్మహత్య చేసుకోవాలన్న ఉద్దేశంతో సాగర్లోకి దూకినవారిని రక్షించడం ఇప్పుడు ఆయన పని.
ఎలా మొదలైంది?
తనను కన్న తల్లితండ్రులెవరో శివకు తెలియదు. ఊహ తెలిసే సరికి యాకుత్పురాలోని ఒక అనాథాశ్రమంలో ఉన్నాడు. చార్మినార్ దగ్గర్లోని ఓ బడిలో చదువుకున్నాడు. శివ అసలు పేరు హన్మంతు. క్లాసులో అప్పటికే అదే పేరుతో చాలామంది ఉండటంతో, హన్మంతు పేరును శివగా మార్చారు ఆయన టీచర్.
మూడో తరగతి చదువుతున్నప్పుడు (అది ఏ ఏడాదో ఆయనకు గుర్తులేదు) మొహర్రం పండుగ వచ్చింది. ఆ పండుగ నాడు శివ తన ఆశ్రమానికి వెళ్తుండగా, దారి తప్పిపోయారు. మార్గం గుర్తు లేక, ఏవేవో గల్లీలు తిరిగాడు. చివరకు నడిచీనడిచీ దిల్సుఖ్నగర్ చేరుకున్నాడు.
అప్పుడు ఫుట్పాత్ పైనే నివాసం. ఒక టిఫిన్ బండి దగ్గర ఎంగిలి ఆకులు తీసే పని చేసి, వారి దగ్గర టిఫిన్ తినేవాడు. తర్వాత, అక్కడే ఫుట్పాత్పై నివసిస్తోన్న ఓ కుటుంబం దగ్గర చేరాడు. వారు తమ పిల్లలతో పాటూ శివకూ ఇంత తిండి పెట్టేవారు. వారితో పాటూ సరూర్నగర్ చెరువులో ఈత కొట్టడం నేర్చుకున్నాడు శివ. అప్పటికి ఆ పిల్లాడికి తెలియదు, ఆ ఈత తన జీవితంలో ఎలా భాగం కాబోతోందోనని!
అదే ఫుట్పాత్పై సుమారు 18 మంది కుర్రాళ్లు ఒక గుంపుగా చేరారు. అందులో దొంగలు ఉన్నారు. ఇంట్లోంచి తప్పిపోయి వచ్చిన వారు ఉన్నారు. పారిపోయిన వారు ఉన్నారు. మత్తుకు బానిసలు అయిన వారు ఉన్నారు. వీరంతా ఒక జట్టు.
కొత్తపేట పండ్ల మార్కెట్ చాలా ఫేమస్. శివ జట్టులోని కొందరు కుర్రాళ్లు అక్కడకు వచ్చే పండ్ల లారీలు స్లో అయినప్పుడు వాటిపైనున్న పండ్లు దొంగతనం చేసేవారు. ఒకరోజు పోలీసులు వచ్చారు. దొంగతనం చేసినవారినీ, చేయనివారినీ కలిపి తీసుకుపోయారు. గట్టిగా కొట్టారు. ‘‘నేను వాళ్లతో ఉన్నా. కానీ. ఎప్పుడూ దొంగతనం చేయలేదు. చేయని తప్పుకు దెబ్బలు తినడంతో చాలా బాధేసింది’’ అన్నారు శివ ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ.
కొన్ని రోజుల తరువాత ఒక అనాథాశ్రమానికి చెందిన ఒక బృందం వాళ్ల దగ్గరకు వచ్చింది. విడతల వారీగా అక్కడున్న పిల్లలను తీసుకుని వెళ్లారు. ముందు మలక్ పేటలో, తరువాత ఖైరతాబాద్లో ఉంచారు. వయసు పెరిగిన తర్వాత ఆ ఆశ్రమం వాళ్లు పిల్లలకు పనులు చేసే అవకాశం కల్పించారు. శివ తోటి కుర్రాళ్లు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ల్లో చెత్త ఏరుకునే పనిలో చేరారు. తానూ చేరాడు. కానీ అది అతడికి నచ్చలేదు.
ఈ పనులు చేస్తూనే రకరకాల చోట్లకు తిరిగాడు శివ. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర వ్యభిచారం చేసే వారు, తాము కస్టమర్లతో వెళ్లే సమయంలో, తమ పిల్లలకు కాపలాగా ఉండేలా, తమకు అవసరమైన సామాన్లు తెచ్చేలా శివను వాడుకున్నారు. వాళ్లు ఇచ్చే డబ్బు ఆ వయసులో శివకు మంచి ఆదాయం. అదే సరిపోయేది.
అక్కడే శివకు కృష్ణ అనే హిజ్రాతో పరిచయం అయింది. కాస్త చదువుకున్న వాడైన కృష్ణ, క్రమంగా శివను వ్యభిచారం చేసే వారి నుంచి దూరం చేశాడు. తిరిగి ఆశ్రమంలో చేర్పించాడు. కష్టపడి చదువుకోవాలని సూచించాడు. ఆశ్రమం వారితో కూడా కృష్ణే మాట్లాడాడు.
దీంతో ఆశ్రమం వాళ్లు శివను బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. సీనియర్లు తనపై పెత్తనం చేయడం నచ్చని శివ, ఆశ్రమంలో నుంచి మళ్లీ బయటకు వచ్చేశాడు. అప్పుడే ఖాళీగా తిరుగుతూ ఏదో పని చేయడం ప్రారంభించాడు. ఆ క్రమంలో జరిగిందే హుస్సేన్ సాగర్లో మృతదేహం తీసిన ఘటన. అప్పటి నుంచీ అదే తన పని అయిపోయిందంటారు శివ.