సచిన్ తర్వాత ఆ స్థాయి అభిమానులు ఆ ఆటగాడికే ఉన్నారు..షేన్ వాట్సన్
By: Sankar Wed, 04 Nov 2020 5:29 PM
ఆసీస్ మాజీ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ 2016లోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న టి20 క్రికెట్ టోర్నమెంట్లలో ఆయా ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. తాజాగా వాట్సన్ గత మంగళవారం అన్ని రకాల టీ20 క్రికెట్ లీగ్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు.
ఈ సందర్భంగా వాట్సన్ సీఎస్కే టీమ్తో పాటు ధోనితో ఉన్న అనుబంధం గురించి పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు...2018 నుంచి సీఎస్కేతో ఉన్న మూడేళ్ల ప్రయాణం నాకు మరువలేనిది. ఈ మూడేళ్లలో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనితో పాటు కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్ నాకు ఎంతో సహకరించారు. ఒక దశలో వరుసగా 10 మ్యాచ్ల్లో విఫలమైన సమయంలో ధోని నాకు అండగా నిలిచాడు.
కేవలం నాపై ఉన్న నమ్మకంతోనే అవకాశాలు కల్పించాడు. ఈ మూడేళ్లలో సీఎస్కేతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. నేను మొదటిసారి సీఎస్కే జట్టులో అడుగుపెట్టిన 2018లోనే చెన్నై సూపర్కింగ్స్ టైటిల్ కొల్లగొట్టడం.. అదే విధంగా నేను ఆడిన మొదటి ఐపీఎల్ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరపున మొదటి ఐపీఎల్ టైటిల్ గెలవడం యాదృశ్చికం అనే చెప్పొచ్చు.
ఒకసారి ఐపీఎల్ సీజన్ సందర్భంగా ఒకసారి విమానంలో ప్రయాణం చేస్తుండగా ధోనిపై తీసిన డాక్యుమెంటరీ చూసాను. ఆ డాక్యుమెంటరీలో ధోని అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టినప్పటినుంచి కెప్టెన్ అయ్యేవరకు చూశాం. ధోని అనే పేరుకు ఇంత అభిమానం ఉందా.. ఒక వ్యక్తిపై భారతీయ ప్రజలు ఇంతలా గౌరవిస్తారా అనేది వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైంది. బహుశా సచిన్ తర్వాత భారత క్రికెట్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది ధోనిలోనే అనుకుంటా అని అన్నాడు ఈ స్టార్ ఆల్ రౌండర్