కరోనా మళ్ళీ రెండోసారి సోకడం చాల అరుదు.. ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్
By: Sankar Wed, 16 Sept 2020 2:26 PM
కరోనా తగ్గిపోయాక, తిరిగి సోకడం చాలా అరుదని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ చెప్పారు. తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్రలో కరోనా తిరిగి సోకుతున్న కేసులు వస్తున్నాయన్న అనుమానాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హాంకాంగ్లో రెండోసారి వస్తున్న కరోనా గురించి∙సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
రష్యా వ్యాక్సిన్ గురించి మాట్లాడుతూ వారు తయారు చేసిన వ్యాక్సిన్ మూడో దశ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. అయితే శరీరంలో యాంటీబాడీలను పెంచడంలో అది 76 శాతం మందిలో సానుకూల ప్రభావాన్ని చూపినట్లు లాన్సెట్ జర్నల్ లో ప్రచురితమైందన్నారు. ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా మన దేశంలోనే రికవరీలు జరుగుతున్నాయని ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషన్ చెప్పారు.
ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 90,123 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 50,20,360 కు చేరింది. కోవిడ్ బాధితుల్లో తాజాగా 1290 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 82,961 కు చేరింది.వైరస్ బాధితుల్లో సోమవారం ఒక్కరోజే 82,961 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 39,42,360. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 9,95,933. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. భారత్లో కరోనా రోగుల రికవరీ రేటు 78.53 శాతంగా ఉందని తెలిపింది. మరణాల రేటు 1.63 శాతంగా ఉందని వెల్లడించింది